మీ దాష్టీకాలను ప్రజలు మరిచిపోలేదు
కాంగ్రెస్పై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్
రాజ్యాంగ బద్ధంగా కాంగ్రెస్ శాసనసభా పక్ష విలీనం
అభ్యంతరాలు ఉంటే.. స్పీకర్, కోర్టులను ఆశ్రయించండి
సాక్షి, హైదరాబాద్: ‘టీఆర్ఎస్లో కాంగ్రెస్ శాసనసభా పక్ష విలీనం.. అత్యంత రాజ్యాంగబద్ధంగా జరిగింది. ప్రజాస్వామ్యం గురించి కాంగ్రెస్ మాట్లాడటం.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుంది. కాంగ్రెస్ నేతలు ఇందిరా పార్కు ముందు ధర్నా చేసినా.. గతంలో వారు చేసిన దాష్టీకాలను ప్రజలు మరిచిపోలేదని’ టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. శనివారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు కలుపుకున్నప్పుడు ప్రశ్నించారా అని కాంగ్రెస్ నేతలను నిలదీశారు.
‘దేశంలో ప్రజాస్వా మ్య ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎమర్జెన్సీ విధించడంతో పాటు.. ఆయారాం.. గయారాం సంస్కృతిని ప్రవేశ పెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. నాయకులు పార్టీలు మారేలా ప్రోత్సహించిన సంస్కృతి కూడా వారిదే. కాంగ్రెస్ పార్టీ వికృత రాజకీయాలకు సంబంధించి ప్రజల అనుభవంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. 1971లో తెలంగాణ ప్రజా సమితి పేరిట గెలిచిన 11 మంది ఎంపీలను.. కాంగ్రెస్లో విలీనం చేసుకున్నా రు’ అని అన్నారు. ‘2004లో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుని పోటీ చేసి.. గెలిచిన 26 మంది ఎమ్మెల్యేల్లో పది మందిని రాజ్యాంగ విరుద్ధంగా కాంగ్రెస్లో కలుపుకున్నారు. తాజాగా గత డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ పార్టీ బీ ఫారం మీద గెలిచిన ఎంపీ, ఎమ్మెల్సీలను చేర్చుకుని.. రాజీనామా చేయించారా’ అని ప్రశ్నించారు.
విలీనం స్పీకర్ పరిధిలోది...
‘టీఆర్ఎస్లో కాంగ్రెస్ శాసనసభా పక్ష విలీనం అంశం రాష్ట్ర శాసన సభాపతి చూసుకోవాల్సిన వ్యవహారం. అందులో మా పరిధి, పాత్ర ఎంతమాత్ర మూ ఉండదు. స్పీకర్ నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం మాకు లేదు. శాసనసభా పక్ష విలీనం చట్ట విరుద్ధంగా జరిగిందనుకుంటే స్పీకర్తో పాటు సుప్రీంకోర్టు వంటి పలు వేదికలున్నాయి. టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని కాం గ్రెస్ నేతలు అంటున్నారు. గతంలో మా పార్టీ ఎంపీ, ఎమ్మెల్సీలకు రాహుల్ స్వయంగా కండువాలు కప్పినప్పుడు ప్రజాస్వామ్య విలువలు గుర్తుకు రాలేదా? టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరుతామంటే టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ వద్దంటారా? చేరికలు తెలంగాణలో మాత్ర మే జరుగుతున్నాయా? ప్రజాస్వామ్యంలో పార్టీ మారడం కొత్తకాదు. రాష్ట్రంలోని అన్ని ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ఏకపక్ష విజయం సాధిస్తోంది. ప్రజలే ప్రతిపక్షం ఉండొద్దని తీర్పు ఇస్తున్నారు’ అని అన్నారు.
‘స్థానికం’లో సామాజిక న్యాయం...
జిల్లా, మండల పరిషత్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్ద సంఖ్యలో పదవులు ఇవ్వడం ద్వారా సామాజిక న్యాయం పాటించామని కేటీఆర్ అన్నారు. ‘32 జిల్లాల్లోని జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులతో పాటు, 85 శాతానికి పైగా మండల పరిషత్లు టీఆర్ఎస్ దక్కించుకోవడం కొత్త చరిత్ర. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకున్న 2 జాతీయ పార్టీలకు దారుణ పరాభవం ఎదురైంది.
32 జిల్లా పరిషత్ అధ్యక్ష పదవుల్లో 17 స్థానాలు వెనుకబడిన వర్గాలకు, 15 జనరల్ కేటగిరీకి ఇచ్చాం. 23 జిల్లా పరిషత్ ఉపాధ్యక్ష పదవులను వెనుకబడిన వర్గాలకు ఇచ్చాం. మొత్తంగా 32 జిల్లా పరిషత్ల్లో అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులు కలుపుకుని 40 పదవులు వెనుకబడిన వర్గాలకే ఇచ్చాం’అని కేటీఆర్ వివరించారు. జిల్లా, మండల, గ్రామ స్థాయి పదవులకు ఎన్నికైన నేతలు విజయగర్వంతో పొంగిపోకుండా గ్రామ స్వరాజ్యం దిశగా పనిచేయాలని పిలుపునిచ్చారు.