18 నుంచి భద్రాచలంలో తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు
మంత్రులు తుమ్మల, ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడి
హైదరాబాద్ : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈ నెల 18 నుంచి ఏప్రిల్ 1 వరకు శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఎర్రమంజిల్ ఆర్అండ్బీ కార్యాలయంలో శ్రీసీతారామకల్యాణ మహోత్సవం, శ్రీరామ మహాపట్టాభిషేకోత్సవంపై తెలుగు, హిందీ భాషల్లో రూపొందించిన పోస్టర్లు, ఆహ్వాన పత్రికలను మంత్రులిద్దరూ శనివారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఈనెల 26న శ్రీసీతారాముల తిరుకల్యాణోత్సవానికి ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి సతీ సమేతంగా పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారని తెలిపారు. 27న శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్ స్వామి పర్యవేక్షణలో మహాపట్టాభిషేకోత్సవం, రథోత్సవం జరుగుతాయన్నారు. ఈ బ్రహ్మోత్సవాలకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పాల్గొంటారని, వీటి నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ ప్రభాకర్ శ్రీనివాస్, ఖమ్మం డీసీసీపీ చైర్మన్ మువ్వనేని విజయ్కుమార్ పాల్గొన్నారు.