గచ్చిబౌలి టిమ్స్ ఆస్పత్రి ప్రారంభం
153 మంది డాక్టర్లు, 228 మంది నర్సుల బృందం సేవలు
కరోనా పాజిటివ్ రోగులకు చికిత్స అందించేందుకు సర్వం సిద్ధం
సాక్షి, గచ్చిబౌలి: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో హైదరాబాద్లోని గచ్చిబౌలి స్పోర్ట్ విలేజ్ కాంప్లెక్స్ భవనంలో ఏర్పాటు చేసిన కోవిడ్–19 అధునాతన ఆస్పత్రి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్(టిమ్స్) సోమవారం అందుబాటులోకి వచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఎలాంటి హంగూ ఆర్భాటాలు, ప్రారంభ వేడుకలు లేకుండానే కరోనా దవాఖానాను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చారు. 1,500 బెడ్లతో కూడిన ఈ ఆస్పత్రిలో ప్రత్యేక వార్డులు, వైద్య పరికరాలు, ఐసీయూ, వెంటిలేటర్ సదుపాయాలను సిద్దం చేశారు. ఈ ఆస్పత్రిలో 468 గదులు ఉండగా 153 మంది డాక్టర్లు, 228 మంది నర్సులు, 578 మంది ఇతర వైద్య సిబ్బంది సేవలు అందిస్తారు.
కరోనా పాజిటివ్ వచ్చిన వారిని ఇందులో వైద్య సేవలను అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ఆస్పత్రిని సిద్ధం చేయడంలో వైద్య సిబ్బంది, ప్రభుత్వ యంత్రా ంగం కృషి చేయగా, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ నిరంతరం పర్యవేక్షించారు. ఆస్పత్రిని ఇటీవలే మంత్రి కేటీఆర్ పరిశీలించారు. కాగా, కోవిడ్–19 ఆస్పత్రిని సెంట్రల్ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ బృందం సోమవారం పరిశీలించింది. ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించి నిర్వహణ, పర్యవేక్షణకు సంబంధించిన అంశాలను అడిగి తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు. చదవండి: హలో డాక్టర్: వీడియోకాల్తో ‘కరోనా’ కన్సల్టేషన్