మా రాష్ట్రానికి మమ్మల్ని పంపేయండి
తూర్పు సీసీఎఫ్కు ‘ముంపు’ అటవీ సిబ్బంది నివేదన
చింతూరు: ‘రాష్ట్రాల విభజన నేపథ్యంలో తెలంగాణకు వెళ్లాలనుకునే సిబ్బంది నుంచి ఆప్షన్లు కోరారు. ఇప్పుడేమో కిందిస్థాయి ఎక్కడి వారక్కడే పనిచేయాలంటున్నారు. మేము ఆంధ్రలో పనిచేయలేం. మా తెలంగాణాకు మమ్మల్ని పంపేయండి.’ అని తెలంగాణ జూనియర్ ఫారెస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భద్రాచలం సౌత్ అటవీ డివిజన్కు చెందిన సిబ్బంది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సీసీఎఫ్ బీకే సింగ్ను కలిసి వేడుకున్నారు. శనివారం చింతూరు వచ్చిన సీసీఎఫ్ను చింతూరు, కూనవరం, వీఆర్పురం, లక్కవరం రేంజ్లకు చెందిన 14 మంది ఎఫ్ఎస్వో, 24 మంది ఎఫ్బీవో, 29 మంది ఏబీవోలు కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముంపు మండలాల్లోని కేవలం ఎఫ్ఆర్వో, డీఆర్వో స్థాయి అధికారుల్లాగా తమను కూడా తెలంగాణకు పంపాలని కోరారు.
610 జీవో ప్రకారం ఇక్కడే
610 జీవో ప్రకారం ఎఫ్ఆర్వో, డీఆర్వో స్థాయి అధికారులకు మాత్రమే ప్రస్తుతం తెలంగాణకు వెళ్లే వీలుందని, మిగతా కిందిస్థాయి సిబ్బంది ప్రస్తుత డివిజన్ పరిధిలోనే పనిచేయక తప్పదని రాజమండ్రి సీసీఎఫ్ బీకే సింగ్ తనను కలిసిన ఉద్యోగులకు తెలిపారు. సిబ్బంది విజ్ఞప్తిని ఉన్నతాధికారుల ద్వారా ఆంధ్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని, దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో కాకినాడ డీఎఫ్వో డీ వెంకట సుబ్బారెడ్డి, రంపచోడవరం సబ్ డీఎఫ్వో కృష్ణప్రియ, ఏలేశ్వరం సబ్ డీఎఫ్వో సుభద్రాదేవి, చింతూరు లాగింగ్ రేంజర్ ఆనందబాబు, డీఆర్వో శ్రీనివాసరావు, ఉద్యోగసంఘం అధ్యక్షుడు భాస్కర్, ఉపాధ్యక్షుడు సుమన్, కార్యదర్శి శోభన్బాబు, చిన్నభిక్షం, సాయి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.