ఈ గోడ..ఓడరేవు జాడ..!

ఈ గోడ..ఓడరేవు జాడ..! - Sakshi


► కృష్ణా నదీ తీరంలో అద్భుత కట్టడం

► అడవిలో అతిపెద్ద రాతి గోడ నిర్మాణం




జల రవాణా.. ప్రధాని తరచూ అంటున్న మాట. మహారాష్ట్ర నుంచి గోదావరి మీదుగా ఆంధ్రా చేరుకుని అక్కడ్నుంచి బకింగ్‌హామ్‌ కెనాల్‌ గుండా చెన్నై వరకు సరుకు రవాణా చేసుకోవచ్చంటున్నారు. కానీ వేల ఏళ్ల క్రితమే కృష్ణా నదిని విదేశాలతో వాణిజ్యానికి వాడుకున్నట్టు మీకు తెలుసా..?

దాదాపు 12 అడుగుల ఎత్తు.. పది అడుగుల వెడల్పు ఉన్న భారీ గోడ ఇది.. ఎలాంటి అనుసంధానం లేకుండా నాపరాతి సల్పలను ఒకదానిపై ఒకటి పేర్చి దీన్ని రూపొందించారు.. దానికి ముందు వైపు భారీ ద్వారం తరహాలో ప్రవేశ మార్గం.. అక్కడ మట్టితో భారీ ర్యాంపు తరహా ఏర్పాటు.. ఆ తర్వాత పొడవుగా భారీ కాలువ.. అది నేరుగా అక్కడికి 200 మీటర్ల దూరంలో ఉన్న కృష్ణా నది వైపు సాగిన తీరు.. ఆ ఆనవాళ్లు చూస్తే పకడ్బందీ నిర్మాణంగానే కనిపిస్తోంది.. కానీ బాగా శిథిలమై ఉంది. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం కృష్ణాపురం గ్రామం చేరువలో కృష్ణానది తీరంలో కనిపించే ‘వ్యవస్థ’ ఇది. ఓ పట్టాన అంతుచిక్కని మానవ నిర్మాణమది. పురావస్తు శాఖలోనూ దీనిపై ఎలాంటి వివరాలు అధికారికంగా నమోదై లేవు. మరి అడవిలో అంత పెద్ద గోడ ఏంటి? తాజాగా ఔత్సాహిక చరిత్ర పరిశోధకుల పరిశీలనలో ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి.




సాక్షి, హైదరాబాద్‌: వేల ఏళ్ల క్రితమే విదేశాలతో సముద్ర మార్గం మీదుగా వాణిజ్యం నిర్వహించిన ఘనత మనది. శాతవాహనుల కాలంలోనే అద్భుతంగా విదేశీ వాణిజ్యం వర్ధిల్లింది. నాటి వాణిజ్యానికి సజీవ సాక్ష్యమే ఈ గోడ. సముద్ర మార్గం మీదుగా జరిగే వాణిజ్యాన్ని దక్కన్‌ పీఠభూమికి కృష్ణానది ఆలంబనగా నాటి పాలకులు తీసుకొచ్చా రు. అలా నదీ తీరాన ముఖ్యమైన ప్రాంతాల్లో రేవులు ఏర్పాటు చేశారు. కృష్ణాపురం వద్ద కనిపిం చిన ఈ గోడ కూడా అలాంటి ఓ రేవుకు అనుబం« దంగా ఏర్పాటైందని చరిత్రకారులు ధ్రువీకరిస్తున్నా రు. ఈ గోడ ఎగుమతి, దిగుమతి సరుకులను నిల్వ చేసేందుకు ఉద్దేశించిన నిర్మాణానికి సంబంధించినది. చుట్టూ కోట గోడ తరహాలో భారీ నిర్మాణం జరిపి మధ్యలో గదులను నిర్మించారు. నదీ మార్గం వైపు ఉన్న ర్యాంపు, వెనక వైపు ఓ ద్వారం ఉన్నాయి. అక్కడి నుంచి ఎడ్ల బండ్లపై సరుకులు తరలించేవారు. బండ్ల గీరలు తిరిగిన గుర్తులు ఇప్పటికే అక్కడి రాళ్లపై ఉన్నాయి.



అద్భుత ఏర్పాట్లు...

పేరూరు పట్టణం. నల్లగొండ జిల్లా హాలియా సమీపంలో ఉన్న ప్రాం తం. ‘36 దేశాలతో వాణిజ్యం జరి గింది’అని స్పష్టం చేసిన శాసనాలు అక్కడ బయటపడ్డాయి. 8వ శతాబ్దంలోనే గొప్ప రేవుగా చరిత్రలో నిలిచిందన్న ఆధారాలు లభించా యి. ఆ కోవలోనే కృష్ణాపురం కూడా రేవు ప్రాంతంగా విలసిల్లింది. ఇదే కాకుండా సమీపంలోని రేబల్లె, తం గేడు, కేతవరం, చింపిర్యాల, దైడ తదితర ప్రాంతాలు కూడా నౌకా వాణిజ్య కేంద్రాలేనని చరిత్రకారుల పరిశోధనలో తెలుస్తోంది. రేవుల వద్ద సరుకు ఎత్తి, దించేందుకు చేసుకున్న అద్భుత ఏర్పాట్లు అబ్బురపరుస్తున్నాయి. నదికి కొన్ని వందల మీటర్ల దూరంలో ఈ కేంద్రాలు ఏర్పాటు చేసి ఉన్నాయి. అక్కడి వరకు నౌకలు చేరుకునేం దుకు వీలుగా ప్రత్యేక భారీ కాలువ(ఛానళ్లు)లు ఉన్నాయి. చివరి వరకు వచ్చిన నౌకల్లోని సరుకును భద్రపరిచే గదుల వరకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక ర్యాంపులున్నాయి. ఆ గదుల సమూహం నుంచి వెనుక కోట లాంటి గోడకు ద్వారం ఉంది. సరుకును అక్కడి నుంచి బయటకు తరలించేవారన్నమాట.



శాతవాహనుల కాలం నుంచే

ఈ రేవులకు సంబంధించి పురావస్తు శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించలేదు. ఆ శాఖ పూర్వ సంచాలకులు కృష్ణశాస్త్రి దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం ఈ ప్రాంతంలో పర్యాటించారు. 20 ఏళ్ల క్రితం చరిత్ర పరిశోధకులు జితేంద్రబాబు, సూర్యకుమార్, జైకిషన్‌ వీటికి సంబంధించి కొన్ని విషయాలు వెలుగులోకి తెచ్చారు. తాజాగా కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు శ్రీరామోజు హరగోపాల్, మురళి ఆధ్వర్యంలో పర్యటించి.. ఇవి రేవులేనని అభిప్రాయపడ్డారు. ‘శాతవాహనుల కాలంలోనే విదేశీ వాణిజ్యం వర్ధిల్లింది. దానికి సంబంధించిన ఆనవాళ్లను వెలుగులోకి తెచ్చి పర్యాటకుల ముందుంచేలా కృషి జరగాల్సి ఉంది. కానీ అలా జరగలేదు. ఆ ప్రాంతంలో ఆదిమానవుల ఆనవాళ్లు ఉన్నాయి. వారు గీసిన రాతి రేఖా చిత్రాలతోపాటు సమాధులు, పని ముట్లు కనిపిస్తున్నాయి. శాతవాహనుల తదనంతర రాజుల కాలం నాటి శిల్పాలు, శాసనాలున్నాయి. కానీ పరిరక్షించకపోవటంతో స్మగ్లర్లు వాటిని అపహరించారు. నిధి అన్వేషణలో ఇప్పటికీ అక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి. వెరసి అద్భుద సంపద ధ్వంసమైపోతోంది’అని జితేంద్రబాబు, సూర్యకుమార్, హరగోపాల్‌లు ‘సాక్షి’తో ఆవేదన వ్యక్తం చేశారు.



‘పులిచింతల’తో మాయం

పులిచింతల ప్రాజెక్టు సామర్థ్యం పెంచితే ఈ ప్రాంతం మొత్తం నీట మునిగిపోనుంది. ఆ ప్రాజెక్టు ముంపు పరిధిలో పూర్వపు నల్లగొండ జిల్లాలోని 13 గ్రామాల పరిధిలో ఈ అతి పురాతన ఓడరేవులున్నాయి. ఇప్పటికే పురావస్తు శాఖ పరిశోధన జరిపి ఇక్కడి విశేషాలు, ప్రత్యక్ష ఆనవాళ్లు వెలుగులోకి తెచ్చి నాటి అద్భుత ప్రణాళికను ప్రజల ముందుంచాల్సి ఉంది. కానీ ఆ శాఖ పట్టించుకోకపోవటంతో నాటి వివరాలు వెలుగు చూడకుండానే జల సమాధి అయ్యే ప్రమాదం నెలకొంది.



అడుగడుగునా ‘అక్షరాలు’

ఆ ప్రాంతంలో రాళ్లపై అడుగడుగునా రాతలు కనిపిస్తున్నాయి. ఇందులో కొన్ని వాణిజ్యానికి సంబంధించినవి కాగా, కొన్ని నదిని, అక్కడి ఆలయాలను దర్శించిన ప్రముఖుల వివరాలకు సంబంధించినవి. చివరకు కుతుబ్‌షాహీల కాలంలో వాణిజ్యానికి సంబంధించిన వివరాలతో కూడిన శాసనాలు కూడా ఉన్నాయి. వర్తకానికి సంబంధించి వివరాల నమోదు కేంద్రాలుగా కూడా ఈ కట్టడాలు వినియోగించుకుని ఉంటారని, వాటికి సంబంధించి అక్షరాల రూపంలో వివరాలు పొందిపరచి ఉంటారని పరిశోధకులు భావిస్తున్నారు. భైరవుడు, వినాయకుడు.. తదితర దేవతామూర్తుల విగ్రహాలు కనిపిస్తున్నాయి. కొన్ని రాష్ట్ర కూటుల కాలం నాటివి కాగా.. కొన్ని అంతకు పూర్వం, ఆ తర్వాతవి ఉన్నాయి. ఇక కొత్త రాతియుగం, ఇనుప యుగాలకు చెందిన పని ముట్లు, రాళ్లు, ఆయుధాలు, సమాధులు, రాతి చిత్రాలు, ధాన్యం దాచే రాతి గూళ్లు ఉన్నాయి.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top