వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి
► మృత శిశువుకు 2 గంటలపాటు వైద్యం
► మానుకోట ఏరియా ఆసుపత్రిలో ఘటన.. బంధువుల ఆందోళన
మహబూబాబాద్ రూరల్: వైద్యుల నిర్ల క్ష్యంతో శిశువు మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిలో గురువారం జరిగింది. మహబూబా బాద్ జిల్లాలోని నర్సిం హులపేట మండలం దాట్ల గ్రామానికి చెందిన రాపాక ఉమేశ్ భార్య నాగమణికి గురువారం పురుటి నొప్పులు రాగా, ఉదయం 9 గంటలకు ఏరియా ఆస్పత్రికి ప్రసవం కోసం తీసుకొచ్చారు. ఆమెకు పరీక్షలు చేసిన వైద్యులు సాయంత్రం వరకు నార్మల్ డెలివరీ అవుతుందని చెప్పి వెళ్లిపోయారు. సాయంత్రం 5 గంటలకు ఆమెకు చిన్న ఆపరేషన్ చేసి శిశువును బయటకు తీశారు.
జన్మించిన మగశిశువును బంధువులకు చూపించకుండా, అనారోగ్యంగా ఉందని చెప్పి ఆస్పత్రిలోని ఎస్ఎన్సీయూలో రెండు గంటలు వైద్యం అందించారు. అయితే, ఉమేశ్ వెళ్లి డాక్టర్ను అడగడంతో శిశువు మృతిచెందాడని చెప్పారు. ఉదయం పురిటి నొప్పులతో వచ్చిన తన భార్యను వైద్యులు సాయంత్రం వరకు నిర్లక్ష్యం వహించి ఆపరేషన్ చేయడం వల్లే శిశువు మృతిచెందాడని తండ్రి రాపాక ఉమేశ్ ఆరోపిస్తున్నాడు. వైద్యుల నిర్లక్ష్యంపై ప్రభుత్వం, సంబంధిత ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు.