ఆయనవి తాడు బొంగరం లేని మాటలు
సాక్షి, యాదాద్రి: కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు గందమల్ల బస్వపురం రిజర్వాయర్ పనులు పూర్తయితే యాదాద్రి భువనగిరి జిల్లా సస్యశ్యామలంగా మారుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ అభివృద్ధిని చూసేందుకు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డికి కళ్లు లేవని, తాడు బొంగరం లేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. సోమవారం ఇక్కడకు వచ్చిన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
యాదాద్రి టెంపుల్ సిటీగా వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. గొల్ల కురుమలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే సంకల్పంతో నాలుగు నెలల్లో 31 లక్షల గొర్రెలను పంపిణీ చేశామని చెప్పారు. రాష్ట్రంలో లక్షా 14 వేల ఉద్యోగాలకు గాను ఇప్పటి వరకు 38 వేల ఉద్యోగాల నియామకం పూర్తి అయిందన్నారు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదని, ఉంటే ఆధారాలు చూపాలని తలసాని డిమాండ్ చేశారు.