నేడు తెలంగాణ భవన్కు భారీ ర్యాలీ
ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
సాక్షి,సిటీబ్యూరో: టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ సోమవారం బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఉదయం 10 గంటలకు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి నుంచి తెలంగాణ భవన్కు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. ర్యాలీలో గ్రేటర్ పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన విజ్ఙప్తి చేశారు. వర్తమాన రాజకీయాల్లో యువకుడు, ఉత్సాహవంతుడు అయిన కేటీఆర్ యూత్కు స్ఫూర్తిగా నిలిచారని, ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైన నేపథ్యంలో పార్టీ బలీయమైన శక్తిగా ఆవిర్భవించనుందన్నారు.
పంచాయతీరాజ్, ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రిగా కేటీఆర్ ఆయా విభాగాల్లో కీలక మార్పులు తీసుకురావడం ద్వారా తనదైన ముద్ర వేశారన్నారు. గ్రేటర్ పరిధిలో వైట్ ట్యాపింగ్ రహదారులు, ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తోన్న బహుళ వరుసల దారులు, అండర్పాస్లు, బస్బేల వంటి మౌలిక సదుపాయల కల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబుల రోడ్షోలు, ఎన్నికల ప్రచారానికి దీటుగా రోడ్షోలు నిర్వహించిన కేటీఆర్ పార్టీ అద్భుత ఫలితాలు సాధించేందుకు కృషి చేశారన్నారు. రాజకీయాల్లో యూత్ ఐకాన్గా మారిన కేటీఆర్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నామని తెలిపారు.
సంబంధిత వార్తలు