విద్యా డైరెక్టరేట్‌లో టీచర్లపై నిఘా!


సాక్షి, హైదరాబాద్: ఏదో ఒక పని వంకతో, ఉపాధ్యాయ సంఘాల నేతల నెపంతో నిత్యం వందలాది టీచర్లు పాఠశాల విద్యా శాఖ డెరైక్టరేట్, చుట్టూ తిరుగుతుంటారు. ఈ టీచర్లంతా స్కూలులో విద్యార్థులకు పాఠాలు బోధించకుండా ఇలా తిరగడమేంటి? అసలు వీళ్లు బడికి సెలవులు పెట్టే వస్తున్నారా? ఒకవేళ సెలవుపై వచ్చినా విద్యార్థులకు నష్టం వాటిల్లుతుంది కదా! అందుకే డెరైక్టరేట్‌కు వచ్చే టీచర్లపై నిఘా పెట్టేందుకు కార్యాలయంలో సీసీ కెమెరాలను అమర్చాలని ఆ శాఖ డెరైక్టర్ చిరంజీవులు నిర్ణయించినట్లు సమాచారం.

 

  డెరైక్టరేట్‌కు ఎవరెవరు వస్తున్నారు? ఆయా విభాగాల్లో వారు ఏం చేస్తున్నారు? సమస్యల పరిష్కారానికే వస్తున్నారా? నెలల తరబడి ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉపాధ్యాయులను కార్యాలయం చుట్టూ సిబ్బంది ఎందుకు తిప్పుకుంటున్నారు? అసలు సిబ్బంది ఏం చేస్తోంది అనే వివిధ అంశాలు తెలుసుకునేందుకు ఈ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఉపాధ్యాయుల వ్యక్తిగత, సర్వీసు సమస్యల పరిష్కారం దిశగా యోచిస్తున్నారని సమాచారం. జిల్లా స్థాయిల్లోనే సమస్యలను పరిష్కరించే లా ఓ వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఉపాధ్యాయులు, రిటైర్డ్ టీచర్లు వందల కిలోమీటర్ల నుంచి హైదరాబాద్‌కు రాకుండా ఉండేందుకు తగు ప్రత్యామ్నాయాలపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top