వైరల్.. గాంధీలో వైద్య విద్యార్థుల టిక్టాక్
సాక్షి, హైదరాబాద్ : సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉన్న యాప్లలో టిక్టాక్ ఒకటి. అయితే ఈ యాప్తో కొందరు సెలబ్రిటీలుగా మారుతుంటే.. చాలా మంది తమ పనులు మరిచి టిక్టాక్కు బానిసలుగా మారుతున్నారు. తాజాగా గాంధీ ఆస్పత్రిలో వైద్య విద్యార్థులు టిక్టాక్ బాట పట్టారు. తమ విధులను మరిచి ఆస్పత్రిలో టిక్టాక్ చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ఈ వీడియోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీనిపై వేగంగా స్పందించిన గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ చర్యలు ప్రారంభించారు.
ఈ వీడియోల్లో ఉన్నవారిని సాధన మెడికల్ కాలేజ్లో ఫిజియోథెరపీ విద్యార్థులు సామ్యూల్, వీణలుగా గుర్తించారు. వారు కేవలం ఇంటర్న్షిప్ కోసం మాత్రమే గాంధీకి వచ్చారని.. టిక్టాక్ వీడియోలతో తమకు సంబంధం లేదని పేర్కొన్నారు. ఈ ఘటనపై డిపార్ట్మెంటల్ విచారణకు ఆదేశించిడంతోపాటు.. ఫిజియోథెరపీ ఇంచార్జ్కు నోటీసులు కూడా జారీ చేశారు. అలాగే ఆస్పత్రిలో ఇంకా ఎవరైనా విద్యార్థులు టిక్టాక్ వీడియోలు చిత్రీకరించారనే దానిపై కూడా విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే ఆ ఇద్దరు విద్యార్థులను ఇంటర్న్షిప్ నుంచి తొలగించారు.
ఇటీవల ఖమ్మం నగర పాలక సంస్థ కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగులు కూడా టిక్టాక్ యాప్లో సరదా వీడియోలు అప్లోడ్ చేసి.. హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ టిక్టాక్ వీడియోలు వైరల్ కావడంతో కార్పొరేషన్ సిబ్బంది తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరిన్ని వార్తలు