పాఠశాల దుస్థితిపై ఉపాధ్యాయుడి నిరసన

Students Protest Over Govt School Condition In Warangal Rural District - Sakshi

సాక్షి, వరంగల్‌ : కొన్ని సార్లు సామాన్యుల నిరసనలు.. వారు చేసే పోరాటాన్ని ప్రతిబింబించేలా ఉంటాయి. అలాంటి నిరసనలు సమస్య తీవ్రతను తెలియజేయడమే కాకుండా, ఇతరుల దృష్టిని ఆకర్షిస్తాయి. వరంగల్‌ రూరల్‌ జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాల దుస్థితిపై అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుడు చేపట్టిన నిరసన కూడా ఇలాంటిదే. వివరాల్లోకి వెళితే.. చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరింది. ఇంగ్లిష్‌ మీడియంలో బోధన సాగిస్తున్న ఈ పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు 89 మంది విద్యార్థులు ఉన్నారు. ఆరుగురు ఉపాధ్యాయులు ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. మూడు తరగతి గదులు ఉండగా.. అన్ని కూడా శిథిలావస్థకు చేరాయి. అలాగే ఆ పాఠశాలలో ఇతర కనీస వసతులు కూడా లేవు.  

ఈ పరిస్థితుల్లో స్లాబ్‌ పెచ్చులు ఎప్పుడూ తమపై ఊడి పడతాయనే భయంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు బిక్కుబిక్కుమంటూ పాఠశాలలో కాలం వెళ్లదీస్తున్నారు. అయితే ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు ఆ పాఠశాలలో గణితం బోధిస్తున్న దస్రు అనే ఉపాధ్యాయుడు విద్యార్థులతో కలిసి వినూత్నంగా నిరసన తెలిపారు. తన తలపై హెల్మెట్‌ ధరించి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఆ సమయంలో విద్యార్థులు కూడా తమ తలలపై పలకలు ఉంచి నిరసన తెలిపారు. విద్యార్థులతో కలిసి ఆ టీచర్‌ నిరసన తెలుపుతున్న ఫొటో పరిస్థితి తీవ్రతను అద్ధం పట్టేలా ఉంది. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top