సూర్యుడి వద్దకు విద్యార్థుల పేర్లు
సంగారెడ్డి విద్యార్థులను ఎంపిక చేసిన నాసా
జిన్నారం (పటాన్చెరు): సంగారెడ్డి జిల్లా విద్యార్థులకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ద్వారా అరుదైన అవకాశం దక్కింది. నాసా ప్రత్యేకంగా రూపొందించిన ఓ యంత్రం ద్వారా తమ విద్యార్థుల పేర్లను సూర్యుడిపైకి పంపించే అవకాశం వచ్చిందని జిన్నారం మండలం బొల్లారం గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు అడ్డాడ శ్రీనివాస్రావు శనివారం తెలిపారు.
సౌర వ్యవస్థ, గ్రహాల వాతావరణంపై సూర్యుడి ప్రభావం గురించి సూర్యుడికి అతిదగ్గరగా అధ్యయనం చేసేందుకు నాసా మే నెలలో ‘పార్కర్ పోలార్ ప్రోబ్ స్పేస్ క్రాఫ్ట్’అనే యంత్రాన్ని అంతరిక్షంలోకి పంపబోతోంది. ఈ యంత్రంలో ఉండే మెమొరీ కార్డులో ఔత్సాహికుల పేర్లను నిక్షిప్తం చేసి పంపుతామని, ఇందుకోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని నాసా ప్రకటించింది.
ఇందులో పాఠశాలకు చెందిన ఫణిధర్, నరేశ్, ఉదయ్, గౌతమి, అనితలకు ఈ అవకాశం దక్కింది. వారి పేర్లను నాసా ద్వారా సూర్యుడి దగ్గరకు పంపే యంత్రంలోని మెమొరీ కార్డులో నిక్షిప్తం చేసి పంపుతామని విద్యార్థులకు సమాచారం పంపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మాణిక్రెడ్డి ఈ విద్యార్థులను అభినందించారు.
మరిన్ని వార్తలు