నేలమ్మా.. వందనాలమ్మా
పుడమితల్లి ఒడిలో సేద్యానికి శ్రీకారం
సాగుబడి పాఠాలు
భద్రాద్రి కొత్తగూడెం: అమ్మానాన్నతో పాటు మేము సైతం..అంటూ విద్యార్థులు పొలంబాట పడుతున్నారు. కరోనా ప్రభావంతో విద్యాసంస్థలు తెరుచుకోక ఇళ్ల వద్దే ఉన్న పిల్లలు సాగుబడి పాఠాలు నేర్చుకుంటున్నారు. అబ్బాయిలేమో అరకలు దున్నడం ఒంటపట్టించుకుంటుండగా..అమ్మాయిలేమో నడుముకు జోలె కట్టి జోరుగా గింజలు పెట్టేస్తూ చెమటోడుస్తున్నారు. ఆడుతూ..పాడుతూ పనులు చేస్తూ..ప్రకృతి ఒడిలోనే భోజనాలు చేస్తూ..శ్రమైక జీవన సౌందర్యం చాటుతున్నారు.
–‘సాక్షి’ ఫొటో జర్నలిస్ట్,
వడివడిగా పనులు
కోటి ఆశలతో రైతులు వానాకాలం వ్యవసాయ పనులు చేపట్టారు. ఇటీవల కురుస్తున్న జల్లులతో నేల తడిచి సాగుకు సానుకూలంగా మారడంతో యాసంగి పంట అవశేషాలను తీసేస్తున్నారు. ఎద్దుల అరకలు కట్టి..వరుసబెట్టి దుక్కులు దున్నుతూ చదును చేసే పనులు చేపట్టారు. పలుచోట్ల గింజలు తెచ్చి విత్తుకుంటున్నారు. పుడమి తల్లి ఒడిలో శ్రమిస్తూ..చక్కని పంటలు పండాలని కోరుకుంటూ ముందుకు సాగుతున్నారు.
–‘సాక్షి’ సీనియర్ఫొటో జర్నలిస్ట్,ఖమ్మం