ప్రియుడు మోసగించడంతో..

student committed suicide love failure - Sakshi

పురుగుల మందు తాగి విద్యార్థిని ఆత్మహత్య

మహబూబాబాద్‌ రూరల్‌: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి ప్రియుడు మోసగించడంతో ఓ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహబూబాబాద్‌ పట్టణ శివారులోని సిగ్నల్‌ కాలనీలో ఆదివారం జరిగింది. టౌన్‌–3 ఎస్సై గంగాధర నర్సయ్య తెలిపిన వివరాల ప్రకారం... మహబూబాబాద్‌ పట్టణ శివారులోని సిగ్నల్‌ కాలనీకి చెందిన పండ్ల వ్యాపారం చేసుకుని జీవించే మనుబోతుల యశోద మూడవ కుమార్తె శిరీష(17) పట్టణంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతుంది. శిరీషకు ఇదే కాలనీకి చెందిన శ్యామల మల్లయ్య కుమారుడు కార్తీక్‌తో పరిచయం ఏర్పడి ఆ పరిచయం ప్రేమకు దారి తీసింది.

కొద్ది రోజుల క్రితం కార్తీక్, శిరీషల మధ్య పెళ్లి విషయం రావడంతో ఆ యువకుడు శిరీషను వివాహం చేసుకోనని చెప్పాడు. అంతే కాకుండా ఆమెను చస్తే చావు అని తెగేసి చెప్పడంతో ఈ నెల 23న మధ్యాహ్నం పురుగుల మందు తాగింది. అపస్మారక స్థితికి చేరుకున్న ఆమెను స్థానికులు మానుకోట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శిరీష ఆదివారం మృతి చెందింది. సంఘటనకు బాధ్యుడైన శ్యామల కార్తీక్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై గంగాధర నర్సయ్య తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top