‘సారా, బీరు కాదు.. తాగునీళ్లు కావాలి’
గద్వాల అర్బన్ : పోరాడి సాధించుకున్న తెలంగాణలో పారాల్సింది సారా, బీరుకాదు.. పంట పొలాల్లో సాగునీరు, ప్రజల గొంతుల్లో మంచినీళ్లని చైతన్య మహిళా సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జ్యోతి అన్నారు. సంపూర్ణ మద్యం నిషేధం కావాలని డిమాండ్ చేస్తూ.. శుక్రవారం ఎక్సైజ్ కార్యాలయం ఎదుట చైతన్య మహిళా సంఘం ఆధ్వర్యంలో సుమారు గంటపాటు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ.. నూతన మద్యం పాలసీ పేరుతో ప్రభుత్వం దోపిడీ చేస్తుందని విమర్శించారు.
మహిళల కన్నీళ్లతో వచ్చిన డబ్బుతో బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం సిగ్గుచేటన్నారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల్లో ఇచ్చిన సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎక్సైజ్ కార్యాలయ అధికారికి వినతిపత్రాన్ని అందజేశారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దర్వేష్బీ, భవానీ, టీవీవీ బలరాం, రైతాంగ సమితి రామిరెడ్డి, సుభాన్, కృష్ణయ్య, నాగన్న తదితరులు పాల్గొన్నారు.