ఒకే రోజు మూడు పథకాలు ప్రారంభం
మంత్రి హరీశ్రావు వెల్లడి
తూప్రాన్: ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మల్కాపూర్లో ఆగస్టు 15న ఒకే రోజు మూడు పథకాలను ప్రారంభించనున్నారని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. మల్కాపూర్లో సీఎం పర్యటన సందర్భంగా సోమవారం ఆయన ఏర్పాట్లను పరిశీలించారు. బీసీలకు సబ్సిడీ రుణాలు, కంటి వెలుగు పథకం, గేదెల పంపిణీ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టనున్నారని తెలిపారు. ఇందుకు వేదిక మల్కాపూర్ కావడం చాలా గర్వంగా ఉందన్నారు.
ఈ గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. మల్కాపూర్ గ్రామస్తులు మంచి క్రమశిక్షణతో గ్రామాభివృద్ధికి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ‘కంటి వెలుగు’ పథకం దేశానికే ఆదర్శం కానుందన్నారు. హెలిప్యాడ్, సభాస్థలిని మంత్రి హరీశ్, కలెక్టర్, ఎస్పీలతో కలసి పరిశీలించారు. కంటివెలుగు పథకం ప్రారంభం సందర్భంగా సభావేదిక వద్ద ఐదు స్టాళ్లను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం మల్కాపూర్ గ్రామస్తులతో మాత్రమే మాట్లాడతారని తెలిపారు. అనంతరం గ్రామంలో పర్యటించిన మంత్రి, ఇళ్ల ముందు నాటిన మొక్కలను చూసి çహర్షం వ్యక్తం చేశారు.