శ్రీశైలం ఏడు గేట్ల ఎత్తివేత

Srisailam's seven gates were lifted - Sakshi

ఎగువ నుంచి మళ్లీ పెరిగిన వరద

జలాశయంలోకి 2.76 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

నాగార్జునసాగర్‌కు 2.59 లక్షల క్యూసెక్కుల ప్రవాహం

సాక్షి, అమరావతి/ శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైలం జలాశయానికి సోమవారం సాయంత్రం నుంచి వరద ఉధృతి పెరిగింది. దీంతో రాత్రి 11 గంటల సమయానికి మళ్లీ మొత్తం ఏడు గేట్లను పది అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సోమవారం సాయంత్రం 6 గంటల  వరకు మూడు గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. అయితే.. జూరాల నుంచి భారీగా ఇన్‌ఫ్లో ఉండడంతో రాత్రి 11 గంటలకు 7 గేట్లు ఎత్తారు. జూరాల నుంచి 2,21,994 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 53,748, హంద్రీ నుంచి 200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది.

స్థానికంగా కూడా వర్షం కురవడంతో మొత్తం 2,76,188 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 210.0320 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యామ్‌ నీటి మట్టం 884 అడుగులకు చేరుకుంది. కుడి గట్టు విద్యుత్‌ కేంద్రంలో ఉత్పత్తి చేస్తూ 27,501 క్యూసెక్కులు, ఎడమగట్టు నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ 42,378 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. 1,90,000 క్యూసెక్కులు నాగార్జున సాగర్‌కు వదులుతున్నారు. పోతిరెడ్డి పాడు ద్వారా 11,000, హంద్రీ నీవా ద్వారా 1,013, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 1,600 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు.

మొత్తం 2,73,492 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కాగా సాగర్‌కు 2,59,879 క్యూసెక్కుల వరద వెళుతోంది. ప్రస్తుతం నాగార్జునసాగర్‌లో 551.8 అడుగుల్లో 213.761 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. నాగార్జునసాగర్‌ నిండాలంటే ఇంకా 99 టీఎంసీలు అవసరం. వరద ఇదే రీతిలో మరో 15 రోజులపాటూ కొనసాగే అవకాశం ఉండటంతో ఈ ఏడాది నాగార్జునసాగర్‌ నిండటం ఖాయమని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. నాగార్జునసాగర్‌కు దిగువన మున్నేరు, మూసీ నదుల నుంచి కృష్ణాలోకి వరద ప్రవాహం కొనసాగుతోంది.

సోమవారం పులిచింతల ప్రాజెక్టులోకి 6,196 క్యూసెక్కులు చేరడంతో నీటి నిల్వ 15.01 టీఎంసీలకు చేరుకుంది. పులిచింతల ప్రాజెక్టు నిండాంటే ఇంకా 30.76 టీఎంసీలు అవసరం. తుంగభద్ర జలాశయంలోకి 30,219 క్యూసెక్కులు చేరుతుండగా ఆయకట్టుకు 2,703 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర జలాశయం నిండాలంటే ఇంకా 12.9 టీఎంసీలు అవసరం.

ఉప నదుల నుంచి పెన్నా నదిలోకి వరద నీరు చేరుతోండటంతో సోమవారం సోమశిల ప్రాజెక్టులోకి 18,270 క్యూసెక్కులు చేరాయి. దాంతో సోమశిల ప్రాజెక్టులో నీటి నిల్వ 45.23 టీఎంసీలకు చేరుకుంది. కాగా, సోమవారం బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి శ్రీశైలం డ్యామ్‌ను సందర్శించి ఇంజినీర్లను అడిగి నీటి వివరాలను తెలుసుకున్నారు. ఉభయ రాష్ట్రా లు జల వివాదాలను సానుకూల దృక్పథంతో పరిష్కరించుకోవాలని  సూచించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top