శ్రీశైలంలోకి కృష్ణమ్మ పరవళ్లు
854 అడుగులకు నీటి మట్టం
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం జలాశయంలోకి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో జలాశయంలోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులోకి సోమవారం 1,91,624 క్యూసెక్కుల ప్రవా హాలు నమోదుకాగా, నీటిమట్టం 854.3 అడుగులకు చేరింది. సోమవారం సాయం త్రం ఐదు గంటలకు జలాశయంలో నీటి నిల్వ 90.14 టీఎంసీలకు చేరుకుంది. కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఆదివారం రాత్రి వర్షాలు కురవడంతో ఉజ్జయిని, ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల్లోకి వరద వస్తోంది. వర్షాలు పడుతుండటంతో ఆయకట్టుకు నీటిని విడుదల చేయాల్సిన అవసరం లేకపోవడం, నీటినిల్వ గరిష్ఠ స్థాయికి చేరుకోవడం వల్ల వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు.
దీంతో జూరాల జలాశయానికి 1,19,380 క్యూసెక్కుల వరద ప్రవాహం చేరుతోంది. ఎగువ నుంచి 1,19,855 క్యూసెక్కులు దిగు వకు విడుదల చేస్తున్నారు. దీనికి తోడు సుంకేసుల బ్యారేజీ ఇప్పటికే నిండిపోవడం తో వచ్చిన 22,385 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. దీనికి స్థానికంగా కురిసిన వర్షాలతో వరద నీరు తోడవడంతో శ్రీశైలంలోకి వరుసగా మూడో రోజూ భారీగా వరద నీరు చేరింది. ఈ జలాశయం గరిష్ట మట్టం 885 అడుగులు. నీటి మట్టం 875 అడుగులకు చేరితేనే దిగువన నాగార్జున సాగర్కు నీటిని విడుదల చేస్తారు.