'కుల వృత్తులను నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ'
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ నేతలకు ఎన్నికలు దగ్గరకు రాగానే అన్నీ వర్గాల మీద ఎనలేని ప్రేమ ఒలక బోయడం అలవాటేనని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. విపక్షాలు బీసీలు ప్రత్యేకించి గౌడ కులస్తులపై మొసలి కన్నీళ్లు కారుస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ కు తెలంగాణలో ఒక్క బీసీ ఎమ్మెల్యే అయినా ఉన్నాడా ? కనీసం పీసీసీ అధ్యక్ష పదవి రేసులో ఒక్క బీసీ నేత పేరయినా వినిపిస్తుందా ?.. కుల వృత్తులను నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ అంటూ నిప్పులు చెరిగారు. ఇపుడు గౌడ కులస్తుల పై ప్రేమ నటిస్తున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా హైదరాబాద్ లో కల్లు దుకాణాల పై నిషేధం విధించిందన్నారు. మిగతా జిల్లాల్లో కూడా కల్లు దుకాణాలపై నిషేధానికి కాంగ్రెస్ పార్టీ అధికారం లో ఉండగా ప్రయత్నించిందన్నారు. ఇంకా ఏమన్నారంటే..
⇒ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కు తన ఊరు తాటి పాముల అని ఇపుడు గుర్తొచ్చిందా ?
⇒ తాటి చెట్ల ఉనికే ప్రశ్నార్థకమైనపుడు ఉత్తమ్ ఎక్కడికి వెళ్లారు ?
⇒ ఒక కుల వృత్తినే నిషేధించే ప్రయత్నం జరిగినపుడు.. ఇపుడు మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు ఎక్కడ ఉన్నారు ?
⇒ ఈత ,తాటి చెట్లకు సంబంధించి హైబ్రిడ్ విత్తనాలను తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేస్తోంది
⇒ కాంగ్రెస్ హాయాంలో ఇలాంటి ప్రయత్నం జరిగిందా ?
⇒ నీరా పరిశోధనలపై కాంగ్రెస్ నేతలు అధికారంలో ఉండగా ఏనాడయినా ఆలోచించారా ?
⇒ బీసీలకు ఎంబీసీలకు మా ప్రభుత్వం హాయంలో జరిగినంత మేలు గత ప్రభుత్వాల హాయంలో జరిగిందా ?
⇒ రాబోయే రోజుల్లో బీసీలకు మరిన్ని పథకాలు రాబోతున్నాయి
⇒ బీసీలను గత ప్రభుత్వాలు కేవలం ఓటు బ్యాంకుల్లా వాడుకున్నాయి
⇒ బీసీల కోసం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నది మా ప్రభుత్వమే
⇒ నీరా పై అధ్యయనానికి త్వరలోనే కేరళ వెళ్తున్నాం
⇒ మండలానికో రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభించాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నాం
⇒ కాంట్రాక్టుల్లో కూడా బీసీలకు రిజర్వేషన్ కల్పించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉంది
⇒ ఉత్తమ్ పీసీసీ రెన్యువల్ అయిన ఉత్సాహాంలో ఏదేదో మాట్లాడుతున్నారు
⇒ ఉత్తమ్ ఏమీ చెప్పినా పట్టించుకునే పరిస్థితుల్లో బీసీలు లేరు