శ్రీరామ సాగరానికి 56ఏళ్లు

The Sri Ram Sagar Project Has Been Completed 56 Years - Sakshi

బాల్కొండ: ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని, కల్పతరువు అయిన  శ్రీరాంసాగర్‌  నేటితో 56ఏళ్లు పూర్తి చేసుకుంది. అభివృద్ధిలో, ఆయకట్టుకు సాగు నీరు అందించడంలో కొచెం మోదం.. కొంచెం ఖేదం  మిగిలిందని చెప్పవచ్చు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌కు పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కొంత మేరా కృషి చేస్తుంది. కాని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేయడం లేదు.  శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణానికి పునాది రాయి పడి 56 వసంతాలు పూర్తవుతున్న, తెలంగాణ రాష్ట్రానికి గుండె కాయాల ఉన్నప్పటికి పూర్తి స్థాయిలో అభివృద్ధి  నోచు కోవడం లేదు. ప్రాజెక్ట్‌లో నీటి కొరత ఉండకుండా పూర్వవైభవం తీసుకురావడానికి ప్రభుత్వం పునరుజ్జీవన పథకం ప్రవేశపెట్టింది. 

నిర్మాణం జరిగిందిలా.. 
ఎస్సారెస్పీని మూడు ప్రయోజనాలు ఆశించి నిర్మించారు. 18 లక్షల ఎకరాలకు సాగునీరు. 36 మెగావాట్ల విద్యుతుత్పత్తి, చేపల పెంపకం అనే ఆశయాలతో 112 టీఎంసీల నీటి సామర్థ్యంతో 1091 అడుగుల నీటిమట్టంతో 175చదరపు మైళ్ల విస్తీర్ణంతో గోదావరి జన్మస్థానానికి 326 మైళ్ల దూరంలో సముద్ర మట్టానికి ప్లస్‌ 980 అడుగుల ఎత్తులో, జాతీయ రహదారి 44పై ఉన్న సోన్‌ వంతెన ఎగువ భాగం మూడు మైళ్ల దూరంలో ఆదిలాబాద్,  నిజామాబాద్‌ సరిహద్దు ప్రాంతంలో నిర్మించారు. వరద నీరు తాకిడిని తట్టుకునే సువిశాలమైన బండ రాయిని ఎంచుకుని 140 అడుగుల ఎత్తుతో 3,143 అడుగుల పొడువుతో రాతి కట్టడం, 125 అడుగుల ఎత్తుతో 44,750 అడుగుల మట్టి కట్టడంతో మొత్తం 47,893 అడుగుల  డ్యాం నిర్మాణం  చేపట్టారు.

అలాగే 2,510 అడుగుల పొడువు జలదారితో 35,425 చదరపు మైళ్ల క్యాచ్‌మెంట్‌ ఏరియాతో 16లక్షల క్యూసెక్కుల వరద నీటిని తట్టుకునేలా ప్రాజెక్ట్‌ డ్యాం డిజైన్‌ చేసి 50 అడుగుల వెడల్పు, 33 అడుగుల  ఎత్తుతో మొత్తం 42 వరద గేట్లను నిర్మించారు. ప్రాజెక్ట్‌ నుంచి పూడిక పోయోందుకు ఆరు రివర్స్‌ స్లూయిస్‌ గేట్లు నిర్మించారు. ఇలా ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ప్రాజెక్ట్‌కు ప్రధాన సమస్యలు ఇప్పటికి పరిష్కరానికి నోచుకోవడం లేదు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ భద్రత గాలిలో దీపంలా ఉంది. భద్రత కోసం ఏళ్ల తరబడి ప్రతిపాదనలు పెట్టినప్పటికీ ఇప్పటికీ మోక్షం కలగడం లేదు. అంతే  కాకుండా ఎస్సారెస్పీలో పదవి విరమణలే తప్ప నూతనంగా అధికారుల నియామకం లేదు. దీంతో  సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది.  కాలువల మరమ్మత్తులకు నిధులు మంజూరు అవుతున్న పనుల్లో మాత్రం నాణ్యత తూచ్‌ ఉండటంతో కాలువల మరమ్మతు ఎప్పటికి సమస్యగానే మిగిలిపోతుంది. 

అశలన్నీ కాళేశ్వరంపైనే..
శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌కు కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నుంచి వరద కాలువ ద్వార రివర్స్‌ పంపంగ్‌ చేసి 60 టీఎంసీల నీటిని నింపుటకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. దీంతో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌కు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీటి పై ఆధార పడకుండా సంవత్సరం పొడువున నిండుకుండలా ఏర్పడే అవకాశం ఏర్పడింది.  శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌కు కాళేశ్వరం నుంచి రోజుకు ఒక టీఎంసీ చొప్పున 60 టీఎంసీల నీటిని వరద కాలువ ద్వారా రివర్స్‌ పంపింగ్‌ చేపట్టి ప్రాజెక్ట్‌కు తరలిస్తారు. పునరుజ్జీవన పథకం పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ నెలాఖరు వరకు కాళేశ్వరం నీళ్లు ఎస్సారెస్పీకి చేరుతాయని పాలకులు ప్రకటిస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top