వర్సిటీల్లో లైంగిక వేధింపులు! 

Sexual harassment in universities - Sakshi

అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో..

ఏడో స్థానంలో రాష్ట్ర విశ్వవిద్యాలయాలు

యూజీసీ పరిశీలనలో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో లైంగిక వేధింపుల ఘటనలు పెరుగుతున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) అధ్యయనంలో తేలింది. ఉద్యోగులు, బోధనా సిబ్బందికి మాత్రమేకాకుండా విద్యార్థినులకూ ఈ సమస్య తప్పడం లేదని గుర్తించింది. యూజీసీ తొలిసారిగా 2016 ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి 2017 మార్చి 31వ తేదీ వరకు దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో జరిగిన లైంగిక వేధింపుల ఘటనలపై వివరాలను సేకరించింది. ఆ ఏడాది కాలంలో 98 మంది విద్యార్థినులు క్యాంపస్‌లలో లైంగిక వేధింపులకు గురైనట్లు తేల్చింది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లోని యూనివర్సిటీల్లో ఈ ఘటనలు నమోదైనట్లు వెల్లడించింది.

తర్వాత స్థానంలో పంజాబ్, కేరళలో అత్యధికంగా విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఘటనలు జరిగినట్లు గుర్తించింది. ఈ జాబితాలో తెలంగాణ రాష్ట్ర యూనివర్సిటీలు ఏడో స్థానంలో ఉన్నాయి. మొత్తంగా విద్యార్థినుల పట్ల తోటి విద్యార్థులే కాకుండా అధ్యాపకులు కూడా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు యూజీసీ పరిశీలనలో తేలింది. విద్యార్థినులతోపాటు మహిళా అధ్యాపకులు, ఇతర సిబ్బంది కూడా వేధింపులు ఎదుర్కొంటున్నారని వెల్లడైంది. ఈవ్‌టీజింగ్, గేలి చేయడం, అసభ్య మెసేజ్‌లు పంపించడం, వెంటపడి వేధించడం వంటివి జరుగుతున్నట్లు తేల్చింది. 

వివిధ వర్సిటీల్లో లైంగిక వేధింపుల కేసులు 
రాష్ట్రం    కేసులు 
ఉత్తరప్రదేశ్‌    24 
పంజాబ్‌    16 
కేరళ    16 
ఢిల్లీ    12 
హరియాణా    8 
ఉత్తరాఖండ్‌    6 
తెలంగాణ     6 
పశ్చిమబెంగాల్‌    5 
గుజరాత్‌    3 
రాజస్తాన్‌    2 

(2016 ఏప్రిల్‌ 1 నుంచి 2017 మార్చి 31 మధ్య నమోదైన కేసులు)  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top