శభాష్.. హిమేష్
పరిశోధనల్లో దూసుకెళ్తున్న విద్యార్ధి
ఇప్పటికే 8 నూతన ఆవిష్కరణలు
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న చదలవాడ హిమేష్ చిన్నతనం నుంచే సాంకేతికత వైపు దృష్టి సారించి తనలోని పరిశోధనాతృష్టకు పదునుపెట్టి నూతన ఆవిష్కరణలే లక్ష్యంగా దూసుకుపోతున్నాడు. భావి ఆవిష్కర్తగా ప్రగతి పథంలో సరికొత్త రికార్డు సృష్టిస్తున్నాడు. ఈ క్రమంలోనే వృద్ధుల సమస్యలు పరిష్కరించడానికి జేహెచ్పీఎస్లో అటల్ టింకరింగ్ ల్యాబ్లో తన పరిశోధనలను పదునుపెట్టి వృద్ధులకు, అంధులకు ఉపయోగపడే ‘విస్ట్ బ్యాండ్’ అనే పరికరాన్ని కనిపెట్టాడు. ఈ పరికరాన్ని కనుగొనడానికి తన అమ్మమ్మ పడే కష్టాలను చూసి స్ఫూర్తిపొందాడు. వాటిని దూరం చేయడానికి నిశ్చయించుకొని అమ్మమ్మ పడే కష్టాన్ని గమనించి ఈ నూతన పరికరాన్ని కనుగొన్నాడు.
విస్ట్ బ్యాండ్ను మొబైల్కు అనుసంధానించడం వల్ల మొబైల్ మోగి మిగిలిన కుటుంబ సభ్యులు జాగ్రత్త వహిస్తారు. అంతేకాకుండా భవిష్యత్లో ఈ పరికరాన్ని వృద్ధుల నాడీ వ్యవస్థను, శరీర ఉష్ణోగ్రతను, డాక్టర్ల మొబైల్కు అనుసంధానం చేసే ఆలోచనలో ఉన్నాడు. హిమేష్ఆవిష్కరణలను టీఎస్ఐ సోషల్ మీడియా తమ ఇంటింట ఇన్నోవేటర్ పేజీలో ప్రచురించారు. ఈ పరికరాన్ని కనుగొన్న హిమేష్ను నగర పోలీసు అధికారులు ‡ ప్రత్యేకంగా అభినందించారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన ఆవిష్కరణలలో హిమేష్ కనుగొన్న 8 నూతన ఆవిష్కరణలు ప్రదర్శించగా అందులో ప్రతి ఒక్కటీ మన్ననలు అందుకుంది. ప్రజల మానసిక ఒత్తిడి తగ్గించే పరికరాల గురించి అందరూ ఎదురుచూస్తున్నారని, డిప్యూటీ స్పీకర్ జి.పద్మారావుగౌడ్ హిమేష్ను అభినందించారు. ఈ ఆవిష్కరణలకు గానూ తెలంగాణ ప్రభుత్వం నుంచి హిమేష్ భావి ఆవిష్కర్తగా గుర్తింపు అందుకోవడమేకాకుండా పద్మారావు చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నాడు.
మరిన్ని వార్తలు