ఉక్కిరిబిక్కిరవుతున్న కొత్త సర్పంచ్లు
బకాయిలు చెల్లించమనడంతో ఆందోళన
సీఎం కేసీఆర్ ఆదేశాలతో కార్యాచరణ
వసూళ్లకు సిద్ధమవుతున్న ఎస్పీడీసీఎల్
జిల్లాలో బకాయిలు రూ.166.58 కోట్లు
సాక్షి, సిద్దిపేట: ఒక్క నెల కరెంట్ బిల్లు చెల్లించకుంటే పేదవాడిపై జులూం చూపించి విద్యుత్ సరఫరా నిలిపి వేసే విద్యుత్శాఖ అధికారులు.. రాజకీయ నాయకులు, అధికారులు వందల కోట్ల బకాయిలు పడ్డా మౌనంగా ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, బడి, గుడి, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ కంపెనీలు కలిసి మొత్తం రూ. 196.21 కోట్లు బకాయిలు పడ్డా ఇంతకాలం నోరు మెదపలేదు. సాక్షాత్తు› రాష్ట్ర ముఖ్యమంత్రి కలుగచేసుకొని అన్ని విభాగాల విద్యుత్ బకాయిలు చెల్లించాలని ఆదేశించడంతో సర్పంచ్లు, మున్సిపల్ అధికారులతో పాటు, ఇతర జిల్లా అధికారులు కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇదే అదునుగా పెండింగ్ బకాయిల వసూళ్లకు ఎన్పీడీసీఎల్ అధికారులు సమాయత్తం అవుతున్నారు.
జిల్లాలోని మొత్తం 5,23,439 కనెక్షన్ల ద్వారా సగటున 4 నుంచి 5 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగిస్తారు. ఇందులో వ్యవసాయ కనెక్షన్లుపోగా మిగిలిన వాటికి నెలకు సుమారుగా రూ.16 నుంచి 17కోట్ల మధ్య బిల్లులు చెల్లించాలి. అయితే ఇందులో గృహ అవసరాలకోసం, వర్తక, వ్యాపారాలకోసం వినియోగించే విద్యుత్లో 90శాతానికి పైగా బిల్లులు క్రమం తప్పకుండా చెల్లిస్తారు. ఇక పోతే మిగిలిన విద్యుత్ వినియోగానికి మాత్రం నెలల తరబడి బకాయిలు పెండింగ్లో ఉంటున్నాయి. ఇందులో భాగంగానే జిల్లాలోని 499 గ్రామ పంచాయితీలు, ఐదు మున్సిపాలిటీల్లో రూ.166.58కోట్లు ఉన్నాయి. అదే విధంగా ప్రభుత్వ పాఠశాలలు, దేవాలయాలు కలిపి రూ. 1.26కోట్లు, ప్రభుత్వ కార్యాలయాలు రూ.1.45కోట్లు బకాయిలు పడ్డారు. అదేవిధంగా ఇతర ప్రైవేట్ విద్యుత్ వినియోగదారులు రూ.26.91కోట్లు మొత్తం రూ.196.21కోట్ల బకాయిలు ఉన్నాయి.
వన్టైం సెటిల్ మెంట్కు కసరత్తు..
ఇప్పటి వరకు గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, దేవాలయాల్లో విద్యుత్ వినియోగం పెండింగ్ బకాయిలను వన్టైం సెటిల్మెంట్ ద్వారా చెల్లించేందుకు జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం జిల్లాలో మొత్తం ఎన్ని కనెక్షన్లు ఉన్నాయి. వాటిల్లో ఎంత బకాయిలు ఉన్నారు. అనే విషయంపై కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి సురేష్కుమార్లు విద్యుత్శాఖ నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఈ వివరాలను ప్రభుత్వానికి నివేదించనున్నారు. అయితే ఈ బకాయిల్లో శాఖల వారిగా ఆయా ఉన్నతాధికారుల ద్వారా నిధులు కేటాయింపులు జరుపుతారని అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఉన్న బకాయిలను ఒకేసారి చెల్లిస్తే బిల్లుల్లో కొంతమేరకు తగ్గే అవకాశం ఉంటుంది. ఈ వెసులుబాటు ఆధారంగా జిల్లాలోని మొత్తం మొండి బకాయిలు అన్నీ క్లియర్ కానున్నాయి. ఇదే అదునుగా చేసుకొని జిల్లా ఎన్పీడీసీఎల్ అధికారులు బకాయిల జాబితాను సిద్ధం చేసి సంబంధిత అధికారులకు అప్పగించే పనిలో ఉన్నారు.
ఇక నుంచి నెలవారీగా చెల్లింపులు..
ఇప్పటి వరకు ఉన్న పెండింగ్ విద్యుత్ బకాయిలు ఎలాగో ఒక లాగా మొత్తం క్లియర్ అవుతుండగా.. ఇక నుంచి మాత్రం ఏ శాఖకు ఆశాఖ అధికారులే పూర్తి బాధ్యత వహించి ప్రతీ బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయాలు, దేవాలయాలు, బడులకు వారికి కేటాయించిన నిర్వాహణ నిధుల నుంచి విద్యుత్ బిల్లులు చెల్లించే అవకాశం ఉంది. అదే విధంగా గ్రామ పంచాయతీల్లో ఆర్థికంగా ఉన్నవాటికి ఏ ఇబ్బంది ఉండదు. కానీ చిన్న చిన్న పంచాయతీలు, ఆర్థిక వనరులు లేని గ్రామాల్లో ప్రతీ నెల విద్యుత్ బిల్లులు చెల్లించడం అక్కడి సర్పంచ్, పంచాయితీ సెక్రటరీలకు ప్రాణసంకటం కానుంది. గ్రామ పంచాయితీ పన్నులు వసూళ్లు చేసి ఇప్పటికే పలు గ్రామాల్లో పారిశుధ్య పనులు, కార్మికులకు వేతనాలు చెల్లిస్తున్నారు. ఇక ముందు విద్యుత్ బిల్లులకు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుందని పలువురు సర్పంచ్లు వాపోతున్నారు. లేకపోతే వీధి దీపాలు, తాగునీటి సరఫరాకు విద్యుత్ కనెక్షన్ ఉండదు. దీంతో గ్రామస్తుల నుంచి వ్యతిరేకత తప్పదు. అదేవిధంగా ప్రతీ కార్యాలయంలో ప్రీపేడ్ మీటర్లు అమర్చే ఆలోచనలో విద్యుత్శాఖ యోచిస్తుంది. దీంతో బిల్లు చెల్లించకుంటే కరెంట్ కట్ అవుతుంది.
పెండింగ్ బకాయిల జాబితా సిద్ధం
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పంచాయతీలు, మున్సిపాలిటీలు, ప్రభుత్వ కార్యాలయాల బిల్లులు వన్టైం సెటిల్మెంట్కు కసరత్తు ప్రారంభమైంది. శాఖల వారీగా బకాయిల జాబితాను సిద్ధం చేసి అధికారులకు అందిస్తున్నాం. ఇక ముందు ప్రతీనెల తప్పనిసరిగా బిల్లులు చెల్లించాల్సిందే. లేని పక్షంలో విద్యుత్ సరఫరా నిలిచి పోతుంది. ఏ నెలకు ఆనెల క్రమం తప్పకుండా బిల్లులు చెల్లిస్తే ఎవ్వరికి ఏ ఇబ్బంది ఉండదు.
– కరుణాకర్బాబు, ఎస్ఈ, ఎన్పీసీడీసీఎల్, సిద్దిపేట
గృహ అవసరాల కనెక్షన్లు | 3,11039 |
వర్తక వాణిజ్య కనెక్షన్లు | 29,664 |
వ్యవసాయ కనెక్షన్లు | 1,70,026 |
పరిశ్రమల కనెక్షన్లు | 4,092 |
బడి,గుడి ఇతర కార్యాలయాలు | 8,613 |
మొత్తం కనెక్షన్లు | 5,23,439 |
జూన్ వరకు మొత్తం బకాయిలు | రూ.196.21కోట్లు |