నిజాయితీ చాటుకున్న కంట్రోలర్
సాక్షి, సిరిసిల్ల : ఆర్టీసి కంట్రోలర్ నిజాయితీ ఓ కుటుంబంలో సంతోషాన్ని నింపింది. సుమారు రూ.లక్ష విలువైన సొత్తు పోయిందనుకుని విలపిస్తున్న తరుణంలో అది పోలీసుల వద్ద ఉన్నట్లు తెలియడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ముస్తాబాద్ గ్రామం పోతుగల్లుకు చెందిన నాంపెల్లి లక్ష్మి శనివారం సిరిసిల్ల నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా మెడలోంచి పుస్తెలతాడు పడిపోయింది. ఆర్టీసీ కంట్రోలర్ రజనీబాయి ఇది గమనించి ఆ గొలుసును సిరిసిల్ల టౌన్ సీఐ శ్రీనివాసరావుకు అప్పగించారు.
ఖరీదైన గొలుసు పోయిందని విలపిస్తున్న లక్ష్మికి గొలుసు పోలీసుల వద్దకు చేరిందన్న విషయం తెలుసుకుని ఎంపీపీ అక్కరాజు శ్రీనివాస్ను ఆశ్రయించారు. ఆయన బాధితురాలితో పాటుగా వెళ్లి ఆదివారం సీఐ శ్రీనివాస్రావును కలిశారు. వివరాలన్నీ అడిగి ఆ గొలుసు ఆమెదిగా నిర్దారించి లక్ష్మికి అప్పగించారు. లక్ష్మితోపాటు ఎంపీపీ శ్రీనివాస్, ఎస్పీ సింగ్, ఎస్ఐ చంద్రశేఖర్, జూపెల్లి నాగేందర్రావు, తదితరులు కంట్రోలర్ రజనీబాయిని అభినందించారు.