పచ్చదనం కోసం ‘మహా’ క్రతువు
పచ్చదనంతోపాటు అభివృద్ధికి రూ.400 కోట్లు
ఘట్కేసర్ ఓఆర్ఆర్లో మొక్కలు నాటిన కమిషనర్ చిరంజీవులు
సాక్షి, హైదరాబాద్: పచ్చదనం కోసం హెచ్ఎండీఏ ‘మహా’క్రతువు ప్రారంభించింది. మూడేళ్లుగా నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో పచ్చదనం పెంపునకు కృషి చేస్తున్న హెచ్ఎండీఏ ఈసారి రూ.400 కోట్లతో చెరువులు, ఔటర్ రింగ్ రోడ్డు, గండిపేట జలాశ యం, నగరానికి అనుసంధానమయ్యే రాష్ట్ర, జాతీ య రహదారుల్లో పచ్చని మొక్కలు నాటి నగరాన్ని పర్యావరణహితంగా తీర్చిదిద్దడంపై దృష్టి సారించింది.
మూడేళ్లుగా మూడు కోట్ల మొక్కలు పంపిణీ చేసి నాటిన హెచ్ఎండీఏ ఈసారి ఏకంగా రూ.80 కోట్ల వ్యయంతో 2.06 కోట్ల మొక్కలను నర్సరీల్లో సిద్ధం గా ఉంచింది. వీటిలో కోటి 60 లక్షల మొక్కలను హెచ్ఎండీఏ నాటుతుండగా, మిగతా వాటిని ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, వ్యక్తుల, జనావాస సము దాయాలకు పంపిణీ చేయనుంది. రంగారెడ్డి జిల్లా లోని 8 చెరువులు, మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లాలోని 10 చెరువులు, సంగారెడ్డి జిల్లాలోని 2 చెరువుల రూపురేఖలు మార్చేందుకు రూ.120 కోట్లు వెచ్చించనుంది.
ఇప్పటికే ఆయా చెరువుల ఫెన్సింగ్ను నిర్ధారించిన అధికారులు వాటి ప్రధాన కట్టడాలను వెడ ల్పు చేసి పచ్చదనాన్ని పెంచనున్నారు. ఆయా చెరువుల చుట్టూ పార్కులను అభివృద్ధి చేసి పర్యాటకులను ఆకర్షించేలా సరికొత్త సొబగులను అద్దనుంది. గండిపేట జలాశయ అభివృద్ధికి ప్రత్యేకంగా రూ.వంద కోట్లు కేటాయించి ఆ చెరువు చుట్టూ పచ్చదనం ఉండేలా మహా ప్రణాళికతో ముందుకెళుతోంది. గండిపేట చుట్టూ 36 కిలోమీటర్ల మేర సైకిల్, వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేయడంతోపాటు పార్కును కూడా అభివృద్ధి చేయనుంది.
చిట్టడవిని తలపించేలా ఓఆర్ఆర్...
ఔటర్ రింగ్ రోడ్డును చిట్టడవిలా మార్చే ప్రక్రియపై హెచ్ఎండీఏ అధికారులు దృష్టి సారించారు. ఇప్పటివరకు హరిహారం మూడు విడతల్లో ఓఆర్ఆర్ చుట్టూ 42.09 లక్షల మొక్కలను నాటారు. ఈసారి 15 లక్షల మొక్కలు నాటేలా హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ అధికారులు ప్రణాళిక రూపొందించారు. దీనిలో భాగంగానే హెచ్ఎండీఏ కమిషనర్ టి.చిరంజీవులు ఘట్కేసర్ ఓఆర్ఆర్ ఇంటర్ఛేంజ్ వద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు.
ఓఆర్ఆర్ చుట్టూ ఉన్న అటవీ శాఖ భూముల్లో పచ్చదనం పెంపొందించడానికి రూ.100 కోట్లు ఖర్చు చేయనున్నారు. గ్రీనరీ గ్రిడ్ పేరుతో భారీ ఎత్తున మొక్కలు నాటి అడవులు తలపించే రీతిలో పెంచనున్నారు. 19 ఇంటర్ఛేంజ్ల వద్ద ల్యాండ్స్కేప్లు అభివృద్ధి చేయనున్నారు. సీఎం కేసీఆర్ ఓఆర్ఆర్పై ప్రధాన దృష్టి పెట్టడంతో భారీ పచ్చ దనం కళ్లకు కట్టేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు.
జాతీయ, రాష్ట్ర రహదారుల్లోనూ...
నగర శివారు ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వచ్చే జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట మొక్కలు నాటా లని హెచ్ఎండీఏ నిర్ణయించింది. సంగారెడ్డి, పటాన్ చెరు, శ్రీశైలం జాతీయ రహదారి, వరంగల్ జాతీయ రహదారిల సెంట్రల్ మీడియన్లలో గ్రీనరీ ఉండేలా ప్రణాళిక రూపొందించింది. హెచ్ఎండీఏ అనుమతినిచ్చిన ప్రైవేట్ లేఅవుట్లలో దాదాపు 35 లక్షలు మొక్కలు నాటేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. ‘గత మూడేళ్లలో రూ.144 కోట్లు ఖర్చు చేసి మూడు కోట్ల మొక్కలు నాటడం, పంపిణీ వంటివి చేశాం.
మూసీ నది పక్కన ఉప్పల్ భగాయత్ లేఅవుట్ వద్ద 9 లక్షలు, జలాశయాల వద్ద కూడా లక్ష మొక్కలు నాటాం. రేడియల్ రోడ్ల చుట్టూ 4.8 లక్షలు, పార్కుల్లో, జాతీయ రహదారి 44, రోడ్డు మధ్యలోని మీడియన్లలో 18.8 లక్షలు, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృధ్ధి కేంద్రం వద్ద లక్ష మొక్కలు నాటాం. ఈసారి రెండుకోట్ల ఆరు లక్షల మొక్కలు నాటడం, పంపిణీ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని హెచ్ఎండీఏ కమిషనర్ టి.చిరంజీవులు తెలిపారు.