మూడేళ్లలో రూ.30వేల కోట్లు
ఉమ్మడి జిల్లాలో 19సార్లు పర్యటించిన ఘనత కేసీఆర్కే దక్కింది
పలు అభివృద్ధి పనులకు రూ.వేల కోట్ల నిధులు మంజూరు
మూసీనుంచి నాగార్జునసాగర్ ఎడమకాల్వకు నీళ్ల తరలింపు
సీఎం మేధస్సునుంచి వెలువడిన కొత్త ఆలోచనకు శ్రీకారం
విలేకరుల సమావేశంలో విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి
నల్లగొండ : టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్ల కాలంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధికి రూ.30 వేల కోట్లు సీఎం కేసీఆర్ మంజూరు చేశారని విద్యు త్ శాఖ మంత్రి జి.జగదీశ్రెడ్డి తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి పర్యటించని స్థాయిలో 19 సార్లు జిల్లాలో పర్యటించిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. 60 ఏళ్ల పాలకుల నిర్లక్ష్యం వల్ల అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న నల్లగొండ జిల్లా ఈ మూడేళ్లలో అభివృద్ధికి బాటలు వేసిందని అన్నారు. ఫ్లోరైడ్ మహమ్మారిని నిర్మూలించడంలో గత పాలకులు అలసత్వం వహించడం వల్లనే వెయ్యి గ్రామాలకు వ్యాపించిందన్నారు.
పేరుకు నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఉన్నప్పటికీ ఏ ఒక్క సీజన్లో కూడా రెండు పంటలకు నీరు ఇచ్చిన సందర్భం ఉమ్మడి రాష్ట్రంలో జరగలేదన్నారు. పైను న్న రాష్ట్రాలు తమకున్న హక్కులను వినియోగించుకుని కృష్ణనీటిని జిల్లాకు రాకుండా అడ్డుకుంటున్నా గత పాలకులు కనీసం నోరుమెదపలేదన్నారు. కృష్ణ నీటి పైన ఆధారపడ్డ సాగర్ ఎడమకాల్వ రైతాంగం నష్టపోకుండా ఉండేం దుకు సీఎం కేసీఆర్ కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టా రని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించే గందమల్ల, బస్వాపూరం రిజర్వాయర్ల నుంచి గోదావరి జలాల ను మూసీలోకి తీసుకొచ్చి అక్కడి నుంచి పెద్దదేవులపల్లి రిజర్వాయర్కు తరలించి సాగర్ ఎడమకాల్వలోకి మళ్లించ డం ద్వారా జిల్లా రైతాంగానికి మేలు జరుగుతుందని సీఎం ఆలోచన చేశారని మంత్రి తెలిపారు.
ఈ ఆలోచన ఏ ఇంజనీర్ నుంచి వచ్చింది కాదని, సీఎం మేధస్సులోంచి పుట్టిందని చెప్పారు. ఎడమ కాల్వ పరిధిలోని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ప్రాతినిధ్యం లేక పోయినా..అ«ధికార, ప్రతిపక్షం అనే రాజకీయ భేదం లేకుండా సీఎం ఆలోచన చేశారని తెలిపారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లా కేంద్రాల్లో మెడికల్ కాలేజీల నిర్మాణాల విషయమై శుక్రవారం రాత్రి సీఎం నాలుగుసార్లు ఫోన్ చేసి తనతో మాట్లాడరని తెలి పారు. కాలేజీల ని ర్మాణానికి వీలైనంత త్వరగా భూసేకరణ చేయాలని, ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డితో మా ట్లాడి అనుమతుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేయాలని చెప్పారన్నారు. త్వరలో కాలేజీల శంకుస్థాపన కార్యక్రమం కూడా చేయాలని సీఎం సూచించినట్టు మంత్రి తెలిపారు.
కొత్త కలెక్టరేట్ నిర్మాణంపై దేనికైనా సిద్ధం
సూర్యాపేటలో శంకుస్థాపన చేసిన కొత్త కలెక్టరేట్ భవన సముదాయం పైన రియల్ఎస్టేట్ ముసుగు దాగివుందని ప్రతిపక్ష నాయకులు చేస్తున్న ఆరోపణల పైన మంత్రి తీవ్రంగా స్పందించారు. మాజీ ఎమ్మెల్యేలు దామోదర్రెడ్డి, సంకినేని వెంకటే శ్వరరావు, పటేల్ రమేష్రెడ్డి..ఈ నలుగురిలో ఎవరు భూమి ఇచ్చిన దాంట్లో కలెక్టరేట్ నిర్మించడానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. వారి భూములకు సంబంధించిన సర్వే నంబర్లు మా వద్ద ఉన్నాయని, అలాగే నాకు సంబంధించిన భూములు ఏమైన ఉన్నట్టు చూపిస్తే దేనికైనా సిద్ధమేనని మంత్రి సవాల్ విసిరారు.
సూర్యాపేటలో కలెక్టరేట్ నిర్మించాలనుకున్న నలువైపుల తమ పార్టీ నాయకులకు సంబంధించిన భూములే ఉన్నాయని...దాంతో విమర్శలు రాకూడదనే ఉద్దేశంతోనే ప్రతిపాధిత ప్రాంతాన్ని ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఆ నలుగురి వల్లనే సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలు నాశనమయ్యాయని, సూర్యాపేట పట్టణ ప్రజలు భయాందోళనల నుంచి ఇప్పుడిప్పుడే స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నారని మంత్రి అన్నారు. సమావేశంలో ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, వేముల వీరేశం, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.