కుటుంబాన్ని మింగిన  ఇసుక లారీ

Road Accident On Medchal Karimnagar District - Sakshi

కారు డ్రైవర్, ఇద్దరు పిల్లలు సహా తల్లి దుర్మరణం

హైదరాబాద్‌ శివారులో ఘటన

మృతులు ధర్మపురి వాసులు

ధర్మపురి : విదేశాల్లో ఉన్న భర్త అనారోగ్యం పాలయ్యాడు. తిరిగి స్వగ్రామానికి వస్తున్నానంటూ ఇంటికి సమాచారమిచ్చాడు. ఎయిర్‌పోర్ట్‌కు వస్తే.. కలిసి ఇంటికెళ్దామన్నాడు. ఏడాదిపాటు దూరంగా ఉన్న భర్తను తీసుకొద్దామనుకున్న ఆ ఇల్లాలు.. తన ఇద్దరు పిల్లలతో సంతోషంగా బయల్దేరింది. ఓ కారును కిరాయి మాట్లాడుకుని.. అందరూ కలిసి ఎయిర్‌పోర్ట్‌ బాటపట్టారు. మరో గంట అయితే వారి సంతోషానికి అవధులు ఉండేవికావేమో.. అంతలోనే ఇసుకలారీ రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. కారు డ్రైవర్‌తోపాటు తల్లీ.. ఇద్దరు పిల్లలు దుర్మరణం చెందారు. హైదరాబాద్‌ శివారులో ఘటన జరగగా.. జగిత్యాల జిల్లా ధర్మపురిలో విషాదం నింపింది.

 స్థానికుల కథనం ప్రకారం..

ధర్మపురి మండలం జైన గ్రామానికి చెందిన టేకుమట్ల గంగారాజం అలియాస్‌ రాజేశ్, సత్తవ్వ(32) భార్యాభర్తలు. వీరికి కుమారుడు శ్రావణ్, కూతురు శాలినీ సంతానం. రాజేశ్‌ ఉపాధి నిమిత్తం ఏడాది క్రితం దోహకత్తార్‌ వెళ్లాడు. అక్కడ అనారోగ్యం బారిన పడడంతో ఇంటికి వస్తున్నానంటూ కుటుంబసభ్యులకు సమాచారం చేరవేశాడు. దీంతో అతడిని తీసుకొచ్చేందుకని సత్తవ్వ ధర్మపురికి చెందిన జెట్టి రాజ్‌కుమార్‌ కారును కిరాయి మాట్లాడుకుని.. గురువారం రాత్రి పిల్లలతో సహా బయల్దేరిం ది. కారు హైదరాబాద్‌ సమీపంలోని మేడ్చల్‌ వద్దకు చేరుకోగానే.. రోడ్డు పక్కన ఆగి ఉన్న ఇసుకలారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్‌ రాజ్‌కుమార్‌ (24), శ్రావణ్‌ (12), శాలినీ (10) అక్కడికక్కడే చనిపోయారు. కొన ఊపి రితో ఉన్న సత్తవ్వను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందింది. నలుగురి మృతదేహాలను హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించా రు. ఎయిర్‌పోర్టులో దిగిన గంగారాజంకు భార్యాపిల్లల మృతి విషయం తెలియడంతో రోదిస్తూ ఆస్పత్రికి చేరుకున్నాడు. విగతజీవులుగా పడి ఉన్న మృతదేహాల వద్ద గంగారాజం రోదనలు పలువురిని కలిచివేశాయి. 

చివరిమాటకైనా నోచుకోలేక ‘పోయారు’

కుటుంబపోషణకు దువాకత్తర్‌ వెళ్లిన గంగరాజం అలియాస్‌ రాజేశ్‌ కొద్దిగంటల్లో కుటుంబ సభ్యులను కలుసుకునే వాడు. భార్య, పిల్లలతో తన బాగోగులు మాట్లాడుకునే వాడు. దురదృష్టవశాత్తు అతడు విమానం దిగకముందే వీరు పరలోకాలకు వెళ్లారు. దీంతో రాజేశ్‌తో భార్య పిలలు చివరిమాటకైనా నోచుకోలేకపోయారు. కుటుంబ సభ్యుల ఆనందంతో కళకళలాడాల్సిన ఇల్లు దుఖఃసాగరంలో మునిగిపోయింది.

 
మిన్నంటిన రోదనలు

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి రెండు కుటుంబాల రోదనలు మిన్నంటాయి. ధర్మపురికి చెందిన రాజ్‌కుమార్‌ గతంలో మలేషియా వెళ్లివచ్చాడు. స్థానికంగా కార్లకు అద్దె డ్రైవర్‌గా వెళ్తుంటాడు. రోడ్డు ప్రమాదంతో ఇరుకుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top