రెడ్లదే పై చేయి

Reddys dominated in Telangana  state - Sakshi

2004 ఎన్నికలు: వైఎస్‌ నాయకత్వంలో ప్రభంజనం 

అత్యధికంగా 44 మంది రెడ్డి అభ్యర్థుల గెలుపు 

పట్టు నిలుపుకొన్న బీసీ, ఎస్సీలు 

దాదాపు దశాబ్దం కిందట అధికారం కోల్పోయిన కాంగ్రెస్‌ పార్టీకి  ఉమ్మడి ఏపీలో ఆనాటి కాంగ్రెస్‌ ప్రతిపక్ష నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రాణం పోశారు. ఆయన సుమారు 1500 కిలోమీటర్ల పాదయాత్ర చేసి అప్పట్లో పెను సంచలనం సృష్టించారు. దాంతో కాంగ్రెస్‌ శ్రేణులలో కొత్త ఉత్సాహాన్ని నింపారు. మొత్తం కాంగ్రెస్‌ పార్టీని తన భుజస్కంధాల మీద వేసుకుని ముందుకు నడిపారంటే ఆశ్చర్యం కాదు. అదే సమయంలో కాంగ్రెస్‌ అధిష్టానం టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోవాలని ఒత్తిడి చేసి అంగీకరింప చేసింది. దీంతో ఉమ్మడి ఏపీలో కొత్త రాజకీయానికి తెరదీసినట్లయింది. 1999 ఎన్నికలలో గెలిచిన టీడీపీకి ఒక రకంగా గట్టి సవాల్‌ను కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ కూటమి విసిరింది. ఈ రెండు పార్టీలకు సీపీఐ, సీపీఎంలు కూడా తోడయ్యాయి. విధాన పరంగా సీపీఎంకు, టీఆర్‌ఎస్‌కు విభేదాలు ఉన్నా, కాంగ్రెస్‌తో సీపీఎం అవగాహనకు వచ్చింది. 2003లో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తిరుపతి వద్ద అలిపిరిలో నక్సలైట్లు మందుపాతర పేల్చారు. అదృష్టవశాత్తు ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆ తర్వాత ఆయన ఆ ఘటన ఆధారంగా తనకు, టీడీపీకి సానుభూతి వస్తుందని ఆశించారు. ఆయన అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. కానీ ఆయన ఊహించిన రీతిలో ఎన్నికలు సత్వరమే రాలేదు. 2004లో పార్లమెంటు ఎన్నికలతో పాటు జరిగిన  అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ ఘోర పరాజయాన్ని చవి  చూసింది. ఉమ్మడి ఏపీలో 47 సీట్లే దక్కితే తెలంగాణలో 11 చోట్లే విజయం సాధించగలిగింది.కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో 48 సీట్లు సాధించుకోగా, మిత్రపక్షాలైన టీఆర్‌ఎస్‌ 26 సీట్లు, సీపీఐ నాలుగు, సీపీఎం ఆరు స్థానాలు పొందాయి. అంటే ఈ కూటమికి 84 సీట్లు వచ్చాయన్నమాట.ఎంఐఎంకు నాలుగు సీట్లు, సమాజ్‌వాది, జనతాపార్టీల తరపున ఒక్కొక్కరు గెలిచారు. ఈ ముగ్గురు కాంగ్రెస్‌ వారే అయినా టిక్కెట్లు రాక వేరే పార్టీలపై పోటీచేసి గెలుపొందారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ లో చేరిపోయారు. బీజేపీకి ఒక సీటు వచ్చింది. కాగా దానం నాగేందర్‌ టీడీపీ పక్షాన గెలిచినా, కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో పార్టీకి, అసెంబ్లీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌ లో చేరారు. కాని ఉప ఎన్నికలో ఓటమిపాలయ్యారు. సామాజిక వర్గాల వారీగా చూస్తే రెడ్డి వర్గం అత్యధికంగా 44 సీట్లు సాధించింది. కాంగ్రెస్‌ పక్షాన 21 మంది, టీడీపీ నుంచి నలుగురు, టీఆర్‌ఎస్‌ పక్షాన 26 మంది గెలిచారు. బీజేపీ నుంచి ఒకరు, సీపీఐ నుంచి ఇద్దరు, సీపీఎం పక్షాన ఒకరు, ఇండిపెండెంటు ఒకరు గెలిచారు. సమాజ్‌వాది పార్టీ, జనతా పార్టీల నుంచి ఒక్కొక్కరు నెగ్గారు. వెలమ నేతలు తొమ్మిది మంది గెలవగా, వారిలో నలుగురు కాంగ్రెస్‌ ,ఇద్దరు టిడిపి, ఇద్దరు టీఆర్‌ఎస్, ఒకరు ఇండిపెండెంట్‌ ఉన్నారు. 

టీడీపీ ఏర్పడిన తర్వాత మొదటిసారి కమ్మవర్గం వారు ఎవరూ టీడీపీ నుంచి గెలవలేదు. అలాగే టీడీపీ ఆవిర్భావం తర్వాత తొలిసారి కాంగ్రెస్‌ నుంచి ఒక కమ్మ అభ్యర్థి సిర్పూరు నుంచి కోనేరు కోనప్ప గెలుపొందారు. సీపీఎం నుంచి ఇద్దరు గెలిచారు. ముస్లింలలో ఇద్దరు కాంగ్రెస్‌ నుంచి, నలుగురు ఎంఐఎం పక్షాన విజయం సాధించారు. ఎస్సీలలో ఎనిమిది మంది కాంగ్రెస్, ఇద్దరు టీడీపీ, ఆరుగురు టీఆర్‌ఎస్‌ ,ఒకరు సీపీఎం నుంచి గెలిచారు. బీసీలలో ఎనిమిది మంది కాంగ్రెస్, ముగ్గురు టీడీపీ, ముగ్గురు టీఆర్‌ఎస్, సీపీఐ, సీపీఎం, ఇండిపెండెంట్‌ ఒక్కొక్కరు గెలుపొందారు. ఇద్దరు బ్రాహ్మణులు టీఆర్‌ఎస్‌ పక్షాన, ఒకరు కాంగ్రెస్‌ నుంచి గెలిచారు. లింగాయత్‌ ఒకరు నెగ్గారు.  వెలమ నేతలలో ఎం.సత్యనారాయణ రావు, దివాకరరావు, జూపల్లి కృష్ణారావు, జలగం వెంకట్రావు, చెన్నమనేని రాజశేఖరరావు, ఎర్రబెల్లి దయాకరరావు, కె.చంద్రశేఖరరావు తదితరులు ఉన్నారు. ప్రముఖ కమ్యూనిస్టు నేత చెన్నమనేని రాజేశ్వరరావు సీపీఐని వదలిపెట్టి టీడీపీలో చేరి ఆరోసారి ఎన్నికవడం విశేషం. కమ్మ వర్గం నుంచి గెలిచినవారిలో తమ్మినేని వీరభద్రం ఉన్నారు. ముస్లిం ప్రముఖులలో షబ్బీర్‌ అలీ, అక్బరుద్దీన్‌ ఒవైసీ ఉన్నారు. బీసీ నేతలలో డి.శ్రీనివాస్, పొన్నాల లక్ష్మయ్య, ముకేష్‌ గౌడ్, దేవేందర్‌ గౌడ్, ఈటెల రాజేందర్, నోముల నర్సింహయ్య, పులి వీరన్న, కొండా సురేఖ, బసవరాజు సారయ్య  ఉన్నారు. ఎస్సీ నేతలలో జి.వినోద్, రాజనరసింహ, జె.గీతారెడ్డి, శంకరరావు, ఎ.చంద్రశేఖర్, జి.విజయరామారావు తదితరులు ఉన్నారు. గిరిజనులలో రెడ్యా నాయక్‌ రికార్డు స్థాయిలో మరోసారి జనరల్‌ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. బ్రాహ్మణ నేతలలో డి.శ్రీధర్‌ బాబు, కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు ఉన్నారు. 

రెడ్డి ప్రముఖులు... 
విజయం సాధిచిన రెడ్డి ప్రముఖులలో సి.రామచంద్రారెడ్డి, ఇంద్రకరణ్‌ రెడ్డి, సుదర్శన్‌ రెడ్డి, కె.ఆర్‌.సురేష్‌ రెడ్డి, జీవన్‌ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పి.జనార్దన్‌రెడ్డి, మర్రి శశిధర్‌ రెడ్డి, చిన్నారెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పురుషోత్తం రెడ్డి, ఆర్‌.దామోదరరెడ్డి, నాగం జనార్దనరెడ్డి, హరీశ్వర్‌ రెడ్డి, సంతోష్‌ రెడ్డి, నాయిని నరసింహారెడ్డి, జి.కిషన్‌ రెడ్డి, చాడ వెంకటరెడ్డి ప్రభృతులు ఉన్నారు. - సామాజిక విశ్లేషణ కొమ్మినేని శ్రీనివాసరావు 


  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top