‘కాళేశ్వరం’పై స్టేకు కారణాలు ఇవీ..
ప్రాజెక్టు పరిధిలో భారీగా అటవీ భూములు
మధ్యంతర ఉత్తర్వులపై ఎన్జీటీ
సాక్షి, న్యూఢిల్లీ : కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంపై మధ్యంతర ఉత్తర్వులిచ్చేందుకు గల కారణాలపై ఎన్జీటీ పూర్తి ఆదేశాల ప్రతులను వెలువరించింది. తెలంగాణలోని పాత 7 జిల్లాల్లో సాగునీటి అవసరాల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టినట్టు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ వెబ్సైట్లో పొందుపరిచారని పిటిషనర్లు విచారణ సందర్భంగా ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ 7 జిలాల్లో 2,866 హెక్టార్ల అటవీ భూమి అవసరమవుతుందని తెలంగాణ ప్రభుత్వం, ఇరిగేషన్ శాఖ జరిపిన ప్రీ ఫీజిబిలిటీ సర్వేలో అంచనా వేశాయని, ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే అటవీ భూముల్లో నిర్మాణ పనులకు అనుమతి పొందడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు దరఖాస్తు చేసుకుందని పిటిషనర్లు వివరిం చారు.
దీనికి సంబంధించి రాష్ట్ర ఇరిగేషన్ శాఖ వెబ్సైట్లో పొందుపరిచిన పూర్తి వివరాలను ట్రిబ్యునల్కు సమర్పించారు. అటవీ భూము ల కోసం అనుమతులకు దరఖాస్తు చేసుకున్న ప్పుడు ఇది సాగునీటి ప్రాజెక్టేనని తెలంగాణ ప్రభుత్వం స్పష్టంగా పేర్కొందని వివరిం చారు. అటవీ భూముల బదలాయింపునకు ప్రభుత్వం చేసుకున్న దరఖాస్తులను పరిశీలించిన ట్రిబ్యునల్.. ఈ ప్రాజెక్టు పరిధిలో భారీగా అటవీ భూములు ఉన్నాయ ని గుర్తించింది. అయితే ప్రభుత్వం మాత్రం ప్రాజెక్టు పరిధిలోకి అటవీ భూములు రావని చెప్పిందని ట్రిబ్యునల్ ఆదేశాల ప్రతుల్లో పేర్కొంది. ప్రభుత్వం సమర్పించిన మ్యాప్ లను పరిశీలిస్తే మాత్రం ప్రాజెక్టు పరిధిలోకి అటవీ భూములు ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోందని ట్రిబ్యు నల్ పేర్కొంది. అటవీ భూముల్లో నిర్మాణా లకు పూర్తి స్థాయి అనుమతులు తప్పనిసరి కావడంతో అనుమతులు వచ్చేదాక ఈ ప్రాజెక్టు నిర్మాణంపై స్టే విధిస్తున్నట్టు తెలిపింది.