అమ‍్మమ్మాస్‌ చపాతీ  రూ. 7

Ready to cook food start up MFPL targets 1lakh units per day - Sakshi

రెడీ టు కుక్‌ ‘అమ్మమ్మాస్’బ్రాండ్‌ 

కూకట్‌పల్లిలో రూ.25 లక్షలతో ప్లాంటు 

రోజుకు  లక్ష చపాతీల విక్రయం లక్ష్యం 

హైదరాబాద్: రెడీ టు కుక్‌ ఫుడ్‌ విభాగంలోకి హైదరాబాద్‌కు చెందిన మంగమ్మ ఫుడ్స్‌  ప్రైవేట్ లిమిటెడ్ (ఎంఎఫ్‌పిఎల్)ప్రవేశించింది. ‘అమ్మమ్మాస్‌’ బ్రాండ్‌ పేరుతో చపాతీ, పూరీ, పరోటా శ్రేణిలో పలు రుచులను పరిచయం చేసింది. రెడీ-టు-కుక్ విభాగంలో ఈ  స్టార్టప్  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి వేగంగా వృద్ధిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

తమ ఉత్పత్తులకు ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నుంచి ధ్రువీకరణ ఉందని మంగమ్మ ఫుడ్స్‌  కో–ఫౌండర్‌ నాగసాయి విశ్వనాథ్‌ శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. ప్రొడక్టులు ఏడు రోజులపాటు మన్నికగా ఉంటాయని వివరించారు. మైసూరులోని  సెంట్రల్‌ ఫుడ్‌ టెక్నలాజికల్‌ రిసర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ సహకారంతో రెడీ టు కుక్‌ ప్రొడక్టుల ఉత్పత్తి చేపట్టామన్నారు. ఇప్పటికే టెస్ట్‌ మార్కెట్లో 30,000 పైగా కుటుంబాలకు  చేరువయ్యామని చెప్పారు. ఔత్సాహికులు ఎవరైనా రూ.2,500ల పెట్టుబడితో తమ కంపెనీ ఉత్పత్తుల విక్రయం చేపట్టవచ్చని వివరించారు. 

తాజా, అధిక పోషకాహార విలువ కలిగిన ఆహార పదార్థాలే  తమ ప్రత్యేకత అని కంపెనీ చెబుతోంది.  అమ్మమ్మాస్‌ బ్రాండ్ పేరుతో  'చపాతీ'  (రాగి, మెంతీ, మల్టీ గ్రెయిన్‌,మోరింగ చపాతి) ' పరోటా '' లను వినియోగదారులకు అందించనుంది.  ఒక్కో చపాతీ ధర రూ .7 గా విక్రయిస్తుంది. 

రోజుకు లక్ష చపాతీలు: మంగమ్మ ఫుడ్స్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో రూ.25 లక్షలతో తయారీ కేంద్రం ఏర్పాటు చేసింది. రోజుకు 40,000 యూనిట్లు తయారు చేయగల సామర్థ్యం ఉందని కో–ఫౌండర్‌ ప్రతిమ విశ్వనాథ్‌ వెల్లడించారు. ‘2020 మార్చికల్లా దీనిని ఒక లక్ష యూనిట్ల స్థాయికి తీసుకు వెళతాం. జనవరి నాటికి రెడీ టు కుక్‌ కర్రీస్, రెడీ టు ఈట్‌ స్నాక్స్‌ విభాగంలోకి ప్రవేశిస్తాం. ప్రస్తుతం విక్రయిస్తున్న ప్యాక్‌ల ఖరీదు రకాన్నిబట్టి రూ.45–70 మధ్య ఉంది. ఒక్కో ప్యాక్‌లో 10  చపాతీలుఉంటాయ’ అని వివరించారు. 

శ్రామిక మహిళలు, సీనియర్ సిటిజన్లు తమ ఆహార అవసరాలకు, ఆరోగ్యకరమైన కానీ రడీ టూ కుక్‌  ఫుడ్‌,  స్నాక్స్ కోసం ఎదురుచూస్తున్నారని, ఈ క్రమంలో వైవిధ్యంగా వారి ఆహార అవసరాలకు తోడ్పడటమే తమ లక్ష్యమని సహ వ్యవస్థకురాలు ప్రతిమ విశ్వనాథ్‌ తెలిపారు. కాగా నాగసాయి విశ్వనాథ్‌ ఘనాలోని టెలికాం సంస్థ గ్లోబాకామ్‌కు బిజినెస్ హెడ్‌గా పనిచేశారు. అలాగే కోకాకోలా, సాబ్-మిల్లెర్, మారికో ఇండస్ట్రీస్ , పార్లే బిస్కెట్స్‌  సహా వివిధ సంస్థలతో కలిసి పనిచేసిన అనుభవం ఉంది.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top