చనిపోయిన కానిస్టేబుల్కు పదోన్నతి
పోస్టింగ్ కూడా కేటాయింపు..
పోలీసు శాఖలో ఇదో చోద్యం
సాక్షి, ఆదిలాబాద్: ఏడాది కిందట చనిపోయిన కానిస్టేబుల్కు పదోన్నతి లభించింది. అంతేకాదు పోస్టింగ్ కూడా ఇచ్చేశారు. ఇది వినడానికి వింతగా ఉన్నా జరిగింది మాత్రం అక్షర సత్యం. పని చేస్తున్న కాలంలో పదోన్నతి కోసం ఎదురు చూశాడో లేదో కానీ ఆ కానిస్టేబుల్కు మరణానంతరం ఉన్నతి లభించడం గమనార్హం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శుక్రవారం 140 మంది పోలీసు కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి కల్పించారు. అందులో నిర్మల్ జిల్లా కడెం పోలీసుస్టేషన్ నుంచి జలపతి కానిస్టేబుల్కు హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి కల్పించారు.
ఆయనకు నిర్మల్ జిల్లాలోనే లక్ష్మణచాందాలో పోస్టింగ్ కేటాయించారు. అయితే.. జలపతి ఏడాది కిందటే మృతి చెందాడు. దండేపల్లి మండలం లింగాపూర్కు చెందిన జలపతి చనిపోయిన తర్వాత ఆయన కుమారుడికి ఉద్యోగం వచ్చిందని కూడా పలువురు చెబుతున్నారు. జాబితాలో జలపతి పేరు చూసిన కడెం పోలీస్స్టేషన్ సిబ్బంది అవాక్కయ్యారు. ఇదేం చోద్యమో అంటూ ఆశ్చర్యపోయారు. ఈ విషయమై జిల్లా ఎస్పీ విష్ణు ఎస్.వారియర్ను వివరణ కోరగా తాను కనుక్కుంటానని చెప్పారు.