వైద్య కాలేజీలకు పోస్టులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న వైద్య కాలేజీలకు, వాటికి అనుబం ధంగా ఉండే ఆస్పత్రులకు బోధన, బోధనేతర, వైద్య సిబ్బంది పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. నల్లగొండ, సూర్యాపేట జిల్లా కేంద్రాల్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఈ రెండు వైద్య కాలేజీలను 2019–20 విద్యా సంవత్సరంలోనే ప్రారంభించేలా సర్కారు చర్యలు తీసుకుంటోంది.
దీనిలో భాగంగా ఈ కాలేజీల నిర్వహణకు అవసరమైన నిధులు కేటాయించిన ప్రభుత్వం తాజాగా ఒక్కో కాలేజీకి 952 పోస్టుల చొప్పున 1,904 పోస్టులను మంజూరు చేసింది. వీటిల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్, ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్ నర్సు వంటి ఉద్యోగాలున్నాయి.
సేవల విభాగంలో 237 చొప్పున 2 కాలేజీల్లో మొత్తం 474 పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేందుకు అనుమతి ఇచ్చింది. వైద్య విద్య సంచాలకుడు ఆధ్వర్యంలో ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ జరగనుందని తెలుపుతూ ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి శివశంకర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.