చక్రం తిప్పుతున్న వారసులు
రాథోడ్ రమేశ్ వారసత్వంగా భార్య.. తనయుడు...
ఉట్నూర్: రాజకీయాల్లో వారసత్వ ప్రవేశాలు సహజమే... ఇలా వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన వారు తమ ఉనికిని చాటుకుంటూ వారసత్వం నిలుపుకుంటున్నవారు ఉన్నారు. ఖానాపూర్ నియోజకవర్గంలో వారసత్వ పరంగా రాజకీయాల్లోకి వచ్చిన వారు ఉన్నారు. 2008 ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వెసిన రాథోడ్ రమేశ్ నామినేషన్ను అధికారులు తిరస్కరించారు. జన్నారం అటవీ డివిజన్ ఇంధన్పల్లి రేంజ్ అధికారి కొండాల్రావు పై చెయ్యి చేసుకున్నాడనే కేసులో నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో రాథోడ్ రమేశ్ వెంటనే బార్యæ సుమన్ బాయితో నామినేషన్ వేయించి ఎన్నికల బరిలోకి దింపగా కాంగ్రెస్ అభ్యర్థి నాగోనావ్పై 713ఓట్ల మెజార్టీతో గెలుపొందింది. 2009 ఎన్నికల్లో 26432 ఓట్ల మెజార్టీతో గెలుపొందింది. 2014 ఎన్నికల్లో రాథోడ్ రమేశ్ ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేయడంతో ఖానాపూర్ అసెంబ్లీకి టీడీపీ అభ్యర్థిగా రాథోడ్ రిథిశ్ను బరిలో దింపాడు అయితే టీఆర్ఎస్ అభ్యర్థి ఆజ్మీరా రేఖ రిథిశ్ రాథోడ్పై 37,940 ఓట్ల మెజార్టీతో గెలుపొందింది.
కొనసాగుతున్న‘కాకా’ వారసత్వం
భైంసా(ముథోల్): ముథోల్ నియోజకవర్గంలో గడ్డెన్న కాకా వారసత్వం కొనసాగుతోంది. ఆయన మరణానంతరం పెద్ద కుమారుడు గడ్డిగారి విఠల్రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం టీఆర్ఎస్లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల బరిలో టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. రెండుసార్లు భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్గా పనిచేశారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కకపోవడంతో ప్రజారాజ్యం నుంచి పోటీచేసి 183 ఓట్లతో ఓటమిచెందారు. గడ్డెన్న చిన్న కుమారుడు భైంసా జెడ్పీటీసీగా పనిచేశారు. రెండవ కుమారుడు గోపాల్రెడ్డి దేగాం గ్రామ సర్పంచుగా పనిచేశారు.
ఇదీ గడ్డెన్న ప్రస్తానం...
భైంసా మండలం దేగాం గ్రామానికి చెందిన గడ్డెన్న సర్పంచుగా రాజకీయ జీవితం ప్రారంభించి ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేశారు. అంతగా చదువులేకపోయినా రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ‘కాకా’గా ఇప్పటికీ పిలిపించుకునే దివంగత నేత గడ్డెన్న వరుసగా నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1967లో స్వతంత్ర అభ్యర్థిగా, 1972లో రెడ్డి కాంగ్రెస్ నుంచి, 1978లో, 1983లో, 1989లో, 1999లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ముథోల్ నియోజకవర్గంలో అత్యధికంగా ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా పని చేశారు. 1989లో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా హైదరాబాద్ సిటీ ఇన్చార్జిగా పనిచేశారు. 2004 ఏప్రిల్ 20న ఓటు వేసి తుదిశ్వాస వదిలారు.