22న దివ్యాంగుల కోటా కౌన్సెలింగ్‌ 

Physically handicapped quota counseling on the 22nd - Sakshi

వ్యవసాయ విశ్వవిద్యాలయం వెల్లడి 

హైదరాబాద్‌: ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వివిధ డిప్లొమా కోర్సుల్లో, వ్యవసాయ, వెటర్నరీ డిగ్రీ కోర్సుల్లో దివ్యాంగుల రిజర్వేషన్‌ కోటాలోని సీట్ల భర్తీ కోసం గురువారం (22న)కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్‌ సుధీర్‌కుమార్‌ తెలిపారు. వివిధ విభాగాల డాక్టర్ల బృందం, డీన్స్‌ కమిటీ అభ్యర్థులు విద్యార్థుల అర్హతలను, సామర్థ్యాలను పరిశీలిస్తారని చెప్పారు. వివిధ డిప్లొమా కోర్సులకు, అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులకు (బైపీసీ స్ట్రీమ్‌) ఆన్‌లైన్‌లో పీహెచ్‌ కేటగిరీలో దరఖాస్తు చేసుకున్న వారే హాజరుకావాలని వెల్లడించారు. ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, ఫీజుతో రావాలని, వివరాలకు (www.pjtsau.edu.in) చూడవచ్చన్నారు.

వ్యవసాయ, వెటర్నరీ, ఉద్యాన సీట్ల భర్తీ.. 
వ్యవసాయ వర్సిటీ వివిధ డిప్లొమా కోర్సుల్లో (వ్యవసాయ, వెటర్నరీ, ఉద్యాన) సీట్ల భర్తీకి ఈ నెల 22న కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు సుధీర్‌ కుమార్‌ తెలిపారు. ఎన్‌సీసీ డైరెక్టరేట్‌ ఆఫీసర్స్‌ సమక్షంలో కౌన్సెలింగ్‌ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాజరుకావాలని సూచించారు. అభ్యర్థులు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో పాటు నిర్ణీత ఫీజు డిప్లొమా కోర్సులకు రూ.12,200 (యూనివర్సిటీ పాలిటెక్నిక్స్‌), రూ.16,600 (ప్రైవేటు పాలిటెక్నిక్స్‌), డిగ్రీ కోర్సులకు రూ.36,450తో హాజరుకావాలని తెలిపారు. ఎన్‌సీసీ ఆఫీసర్‌ ప్రాధాన్యతలను సూచిస్తారని పేర్కొన్నారు. తర్వాత సీట్లను ప్రాధాన్యతల ఆధారంగా, టీఎంసెట్‌– 2019 ర్యాంకుల ప్రకారం భర్తీ చేస్తామని వెల్లడించారు. పూర్తి వివరాలను విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో చూడవచ్చని చెప్పారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top