సమత మరణాన్ని తట్టుకోలేక..
సాక్షి, ఖానాపూర్: ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం ఎల్లపటార్ గ్రామంలో అత్యాచారం, హత్యకు గురైన సమత కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. సమత మామ, ఆమె భర్త తండ్రి ఎల్లయ్య(65) గుండెపోటుతో శనివారం ఖానాపూర్ మండలం గోసంపల్లెలోని తన ఇంట్లో హఠాన్మరణం చెందాడు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఎల్లయ్య సమతపై జరిగిన ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడని కుటుంబీకులు పేర్కొన్నారు. అప్పటి నుంచి దిగాలుగా ఉండేవాడన్నారు. దీంతో శనివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందినట్లు వారు తెలిపారు. కాగా 20 రోజుల వ్యవధిలో ఒకే ఇంట్లో ఇద్దరు మృతి చెందిన ఘటనతో గ్రామంలో, కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.