ఆసరా అందేనా..!


మంచిర్యాల రూరల్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆసరా’ (నూతన పింఛన్) పథకం అభాసుపాలవుతోంది. జిల్లా లో అర్హుల జాబితా ఎంపికపై ఇంకా కసరత్తు కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు దరఖా స్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించే ప్రక్రి య పూర్తి కాకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.



కొందరి పేర్లు ఆన్‌లైన్‌లో నమోదు చేసినా.. అర్హులకు పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదు. దీంతో అధికారులు పునఃపరిశీలన చేపడుతున్నారు. ఫలితంగా అర్హుల జాబితాలో పేర్లు ఉన్న వారికి సైతం పింఛన్లు అందడం లేదు. దీంతో ఇన్నాళ్లు పింఛన్ తీసుకుని.. ఇప్పుడు రాదేమోనని అర్హులు కార్యాలయాల వద్ద ఆందోళనలు కొనసాగిస్తున్నారు.



 అర్హుల జాబితాపై స్పష్టత కరువు

 సామాజిక పింఛన్ల కోసం జిల్లాలో 3.38 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 3వ తేదీ నుంచి 7 వరకు కేవలం 2.01 లక్షల మంది అర్హులైన దరఖాస్తుదారుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. పింఛన్ల పంపిణీని 8వ తేదీ నుంచి ప్రారంభించగా.. అర్హుల జాబితాలో స్పష్టత లేకుండాపోయింది. ఇంకా జిల్లాలో ఎంత మంది అర్హులు ఉన్నారన్న విషయాన్ని అధికారులు తేల్చలేకపోతున్నారు.



గతంలో 2.60 లక్షల మంది పింఛన్లు పొందగా.. ఇప్పటి వరకు అధికారులు 2.11 లక్షల మందినే అర్హులుగా గుర్తించారు. అర్హుల గుర్తింపు కోసం అధికారులు మరోసారి పూర్తి విచారణ చేపడుతున్నా, ఎంపికలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు తమకు పింఛన్లు వస్తాయా? రావా? అని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు ఏయే పింఛన్ల కోసం ఎంత మంది అర్హులుగా ఉన్నారనే విషయాన్నీ అధికార యంత్రాంగం తేల్చలేకపోతోంది.



 తప్పుల తడకగా జాబితాలు..

 ప్రతినెలా మొదటి వారంలోనే పింఛన్ అందుకునే లబ్ధిదారులు ఈనెలలో పెరిగిన పింఛన్లు గానీ.. పాత పింఛన్లు గానీ ఇంతవరకూ తీసుకోలేదు. ఈ నెల 8వ తేదీన పింఛన్ల అర్హుల జాబితాలను గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లో అందుబాటులోకి తెచ్చారు. అయితే.. జాబితాలో తమ పేర్లు గల్లంతయ్యాయని, తమ పింఛన్ కేటగిరీ మారిందని, ఒకరికి బదులుగా మరో పేరు నమోదైందని తెలుసుకుని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కాకుండా వారి కుటుంబ సభ్యుల్లోని వారికి మంజూరు చేశారు. మరికొన్ని చోట్ల వికలాంగుల నెల పిం ఛన్ రూ.1500 కాగా, వారికి వృద్ధాప్య, వితం తు పింఛన్‌కు అర్హులుగా పేర్కొన్నారు. దీంతో వీరికి నెల పింఛన్ రూ.వెయ్యి వస్తే మిగతా రూ.500 నష్టపోవాల్సిందే. అర్హుల విషయంలో సైతం ప్రభుత్వం ముందు ఒక విధంగా, తరువాత మరో విధంగా ఆదేశాలు జారీ చేస్తుండడంతో మరింత గందరగోళం నెలకొంది.



 పునఃపరిశీలనలో మిగిలేవి ఎన్నో..

 ఆన్‌లైన్‌లో నమోదు చేసిన అర్హులైన పింఛన్ దరఖాస్తులను జిల్లా అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. అర్హులుగా నమోదైన వారి వివరాలను జిల్లా ఉన్నతాధికారులు కుటుంబ సర్వే, గతంలో పింఛన్ తీసుకున్న వారి వివరాలను పరిశీలిస్తున్నారు. అనర్హత ఉన్న వారి పేర్లను నాన్‌ఎలిజిబుల్‌గా నమోదు చేసి, ఆయా వివరాలను మండల పరిషత్ కార్యాలయాలకు పంపించి, మరోసారి పరిశీలించిన తరువాతే వారికి పింఛన్లు మంజూరు చేయాలని ఆదేశిస్తున్నారు.



ఇందుకోసం ప్రతి మండలానికి ఎన్‌ఐసీ సర్వర్‌లో లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌లను అందజేశారు. కుటుంబ సర్వే సమయంలో కుటుంబ వివరాల నమోదులో, కంప్యూటరీకరణలో జరిగిన పొరపాట్లు కూడా పింఛన్ అర్హుల ఎంపికకు అడ్డంకిగా మారాయి. ఇన్నాళ్లు కుటుంబ సర్వేలో నమోదైన వివరాల ప్రకారమే పింఛన్ లబ్ధిదారుల వివరాలను సరిపోల్చడంతో దరఖాస్తులపై అన ర్హత వేటు పడుతున్నాయి. కుటుంబ సర్వేలో పేర్లు, వయస్సు, ఆధార్ నంబరు, సదరన్ క్యాంపు ఐడీ నంబర్లు తప్పుగా నమోదు కావడంతో, పింఛన్ దరఖాస్తుల్లోని వివరాలు సరిగా లేక అనర్హతకు గురైనట్లు అధికారులు గుర్తించారు.



ఇన్నాళ్లు కుటుంబసర్వే వివరాలను మార్పు చేసే అవకాశం లేకపోవడంతోనే పింఛన్ దరఖాస్తులు అనర్హతకు గురవుతుండడంతో, ఆయా వివరాలను మరోసారి సర్వే చేసి ఎడిట్ చేసుకునేందుకు జిల్లా అధికారులకు అనుమతిని ఇవ్వడంతో, అధికారులు కొంత ఊరట చెందారు. ఈ నెల 30వ తేదీలోగా పింఛన్లలో ఎంత మంది అర్హులు, అనర్హులనే పూర్తిస్థాయి జాబితాల కొలిక్కిరానుంది. ఈ ప్రక్రియ ఈనెలాఖరు వరకు పూర్తిచేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినా.. పూర్తయ్యేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.



 2011 ప్రకారం జిల్లా జనాభా 7.73 లక్షలు

 సమగ్ర సర్వేలో కుటుంబాల సంఖ్య 8.32 లక్షలు

 గతంలో పింఛన్‌దారులు 2.60 లక్షలు

 పింఛన్ కోసం వచ్చిన దరఖాస్తులు 3.38 లక్షలు

 ఇప్పటివరకు అర్హులుగా గుర్తించినవి 2.11 లక్షలు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top