జీఎస్‌టీ తగ్గినా ప్రేక్షకులకు ఫలితం సున్నా

No Use With GST on Ticket Prices - Sakshi

జీఎస్‌టీ తగ్గినా ప్రేక్షకులకు ఫలితం సున్నా

పాత రేట్లలోనే టికెట్‌ ధరలు

అధికంగా వసూలు చేస్తున్న యాజమాన్యాలు

పట్టించుకోని సంబంధిత అధికారులు

సీజీఎస్టీ చాప్టర్‌ సెక్షన్‌ 15 ప్రకారం యాంటీ ప్రాఫిటింగ్‌ (వ్యతిరేక లాభాలు) ఇలా చేయడం నేరం.ఈ విషయంలో సంబంధిత అధికారులు పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది

సాక్షి, సిటీబ్యూరో: వినోదం కోసం థియేటర్లకు వెళ్తున్న ప్రేక్షకులు నిలువునా మోసపోతున్నారు. టికెట్ల పైనా.. తినుబండారాల పైనా అధిక రేట్లు చెల్లిస్తూనే ఉన్నారు. వాస్తవంగా సినిమా టికెట్లపై ప్రభుత్వం జీఎస్టీ శాతాన్ని తగ్గించింది. కానీ తగ్గిన మేర టికెట్‌ రేట్‌ తగ్గడం లేదు. వినోదంపై జీఎస్‌టీ స్లాబ్‌ రేట్‌ 28 నుంచి 18 శాతానికి తగ్గింది. అయితే థియేటర్ల యాజమాన్యాలు తెలివిగా జీఎస్టీ రేటును సవరిస్తున్నాయే కానీ.. ధర మాత్రం అదే వసూలు చేస్తున్నారు. ఉదాహరణకు ఐమాక్స్‌ థియేటర్‌లో రూ.236 ఉన్న టికెట్‌ ధర జీఎస్టీ తగ్గక ముందు.. తగ్గిన తర్వాత కూడా అదే ధర ఉంది. జీఎస్‌టీ స్థానంలో తగ్గించిన మొత్తాన్ని టికెట్‌ మొత్తం ధరలో కలిపేశారు. దీంతో ప్రేక్షకుడి ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. థియేటర్లలో యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని, తగ్గించిన ధరలను అమలు చేయడం లేదని ఇటీవల ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం థియేటర్లు జారీ చేస్తున్న టికెట్‌లో కేవలం తగ్గిన జీఎస్టీని ముద్రించి ఇస్తున్ననారే కానీ ధర యథాతథంగానే వసూలు చేస్తున్నారు.  

జనవరి19 నుంచే తగ్గిన జీఎస్‌టీ
జీఎస్‌టీ కౌన్సిల్‌ ఈ ఏడాది జనవరి 19వ తేదీ నుంచి వినోదం పన్నును తగ్గించింది. దీంతో సినిమా టికెట్లపై ఉన్న జీఎస్‌టీ 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గింది. ఈ ప్రయోజనం ప్రేక్షకులకు అందకపోవడంపై కొందరు వినియోగదారులు సంబంధిత శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నగరంలోని ఓ ఐమాక్స్‌ థియేటర్‌పై దాడిచేసి వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తగ్గిన జీఎస్‌టీ ప్రయోజనాలు ప్రేక్షకులకు అందడం లేదని, అదేవిధంగా ఆహార ఉత్పత్తులపై కూడా ధరలు అధికంగా వసూలు చేస్తున్నారని ఈ తనిఖీల్లో తేలింది. ప్రతి థియేటర్‌లో టికెట్‌ ధరలు రూ.150 నుంచి రూ.250 వరకు ఉన్నాయి. మల్టీప్లెక్స్‌ వచ్చాక ఎక్కువ శాతం మంది ప్రేక్షకులు ఆ థియేటర్లలోనే సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మొదట టికెట్‌ ధర రూ.100 దాటితే దానిపై జీఎస్‌టీ 28 శాతం వరకు వసూలు చేయాలని నిర్ణయించారు. అయితే, వీటిపై విమర్శలు వెల్లువెత్తడంతో జీఎస్‌టీ కౌన్సిల్‌ దాన్ని 18 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ లెక్క ప్రకారం రూ.150 ఉన్న టికెట్‌ ధర రూ.138 వరకు తగ్గింది. అయినా కొన్ని థియేటర్లు పాత ధరలే ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో వినోద రంగంపై జీఎస్‌టీ 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గే అవకాశం ఉందని, దీంతో టికెట్‌ ధరలు మరింత తగ్గుతాయని భావిస్తున్నారు. కాగా, వినోద పన్ను తగ్గినా ధరలు మాత్రం తగ్గలేదనే విషయం సంబంధిత అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top