అక్బర్‌ ప్రసంగంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు లేవు  

No Provocative Remarks In Akbaruddin Speech Says VB Kamalasan Reddy - Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ కరీంనగర్‌లో ప్రసంగంలో ఎలాంటి విద్వేషపూరిత, రెచ్చ గొట్టే వ్యాఖ్యలు లేవని న్యాయ నిపుణులు తేల్చి నట్టు నగర పోలీసు కమిషనర్‌ వీబీ కమలాసన్‌ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ నెల 23న కరీంనగర్‌లో జరిగిన సభలో అక్బర్‌ పాల్గొన్నారు. ఈ సభలో ఒక వర్గం మనోభావాలను కించపరిచే విధంగా, విద్వేషాలను రెచ్చగొట్టేలా అక్బరుద్దీన్‌ ప్రసంగించారని మూడు రోజులుగా సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టడంతో వైరల్‌ అయింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణ అక్బరుద్దీన్‌పై కేసు నమోదు చేయాలని కమిషనర్‌ను కలసి ఫిర్యాదు చేశారు.

శుక్రవారం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ కూడా తానెలాంటి విద్వేషపూరిత ప్రసంగం చేయలేదని వివరణ ఇచ్చారు. ‘ముందు జాగ్రత్త చర్యగా అక్బరుద్దీన్‌ ప్రసంగాన్ని రికార్డు చేయించాం. ఆ వీడియోను అనువాద నిపుణుల సహాయంతో ట్రాన్స్‌లేట్‌ చేయించి, వీడియో రికార్డింగును, అనువాద ప్రతిని న్యాయ నిపుణుల సలహా కోసం పంపించాం. అయితే.. ఆ వీడియో ప్రసంగంలో ఎటువంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు గానీ, రెచ్చగొట్టే పదాలు గానీ లేవని , ఎలాంటి కేసులు నమోదు చేసే అవకాశం లేదని న్యాయ నిపుణులు చెప్పారు’’అని సీపీ తెలిపారు. ఈ మేరకు ఎలాంటి కేసు నమోదు చేయడం లేదని స్పష్టం చేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top