‘నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్ను కార్పొరేషన్గా మార్చాలి’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్ను, తెలంగాణ నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్గా మార్చాలని రాష్ట్ర నాయీ బ్రాహ్మణ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు సూర్యపల్లి శ్రీనివాస్ కోరారు. దీనికి వెంటనే చైర్మన్, మెంబర్లను నియమించి, 2017– 18 బడ్జెట్లో కేటాయించిన రూ.250 కోట్లను మంజూరు చేయాలన్నారు. తెలంగాణ నాయీ బ్రాహ్మణ హక్కుల పోరాట సమితి ఆవిర్భావ సభ, జననాయక్ కర్పూరి ఠాకూర్ 94వ జయంతి వేడుకలు మంగళవారం రవీంద్రభారతిలో జరిగాయి.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో అన్ని పార్టీలు నాయీ బ్రాహ్మణులకు 4 శాసనసభ, 2 మండలి, ఒక పార్లమెంట్ స్థానాలను కేటాయించాలన్నారు. తెలంగాణ నాయీ బ్రాహ్మణ హక్కుల పోరాట సమితి ప్రధాన కార్యదర్శి ఉప్పల బాల్ రాజ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నాయీ బ్రాహ్మణ కులాన్ని ఓబీసీ – ఏ గ్రూప్లో చేర్చే విధంగా కేంద్రానికి సిఫారసు చేయాలన్నారు.
ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, బీసీ కమిషన్ మెంబర్ వి.కృష్ణమోహన్రావులు మాట్లాడుతూ.. తెలంగాణ నాయీ బ్రాహ్మణ హక్కుల పోరాట సమితి డిమాండ్లను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారం అయ్యేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ నాయీ బ్రాహ్మణ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి మహతి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.