‘సూర్య’ ప్రయోగాన్ని చూసేందుకు రాష్ట్ర విద్యార్థి
నాసా నుంచి ఆహ్వానం అందుకున్న అబీర్
జహీరాబాద్ టౌన్: సూర్యుడిపై ఉన్న ఉష్ణోగ్రతను అధ్యయనం చేయడానికి నాసా (నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్) త్వర లో రాకెట్ను సూర్యునిపైకి పంపనుంది. ఈ ప్రయోగాన్ని వీక్షించడానికి ప్రపంచ దేశాల నుంచి 110 మందిని ఎంపిక చేసింది. వీరిలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్కు చెందిన ఓ విద్యార్థి ఉండటం విశేషం. ఎంపికైన వారి పేర్లను రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపనున్నారు.పట్టణానికి చెందిన మనీష్, రాధిక దంపతులు మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఉంటున్నారు.
పదో తరగతి చదువుతున్న వారి కుమారుడు అబీర్ మనీష్ గోదాగోమంకర్కు ప్రయోగాలంటే చాలా ఇష్టం. సూర్యుడి ఉష్ణోగ్రతను తెలుసుకోవడానికి నాసా రాకెట్ పంపుతోందన్న విషయం తెలుసుకున్నాడు. వెబ్సైట్లో నాసా అడిగిన 10 ప్రశ్నలకు అబీర్ సమాధానాలు ఇవ్వడంతో నాసా నుంచి ఆహ్వానం అందింది. అబీర్ మాట్లాడుతూ.. తొలిసారి సూర్యుడిపైకి పంపుతున్న రాకెట్ ప్రయోగాన్ని వీక్షించడానికి ఆహ్వానం రావడం ఆనందంగా ఉందన్నాడు. మన దేశం నుంచి 13 మంది ఎంపికవగా.. అందులో తన పేరు ఉండటం సంతోషం కలిగించిందన్నాడు.