భార్యాభర్తలపై హత్యాయత్నం
వాజేడు: భూతగాదాలో భార్యాభార్తలపై హత్యాయత్నం జరిగింది. ఈ సంఘటన ఖమ్మం జిల్లా వాజేడు మండలం ఎడ్జర్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అంకెనబోయిన మల్లయ్య ఎకరం చేనులో మినుములు పోస్తున్నాడు. ఈ సమయంలో తాండ్ర సూర్యం, తాండ్ర సావిత్రి అనే భార్యాభర్తలు అక్కడికి వచ్చి తమ చేనులో పంట వేయొద్దని వారించారు. ఈ చేను నాది.. నేనే చేసుకుంటాను.. గతంలో నాకు అమ్మారంటూ మల్లయ్య వారితో వాదనకు దిగాడు. చేను మీది కాదు..మాకు రూ.60 వేలు అప్పుగా ఇచ్చి దాని కింద పంట సాగు చేసుకుంటున్నారు.. ఇపుడు ఆ డబ్బులు ఇస్తామని ఆ దంపతులు చెప్పారు. దాంతో ఆగ్రహం చెందిన మల్లయ్య అందుబాటులో ఉన్న పిక్కా(తోటలో గడ్డిని కోసే కొడవలి)తో వారిపై దాడిచేయగా దంపతులిద్దరూ తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. వీరిని ఆస్పత్రికి తరలించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.