అలకబూనిన కాంగ్రెస్ నేతలు
ప్రాధాన్యత దక్కడం లేదని అసంతృప్తి
ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకున్న మెదక్ నాయకులు
సాక్షి, మెదక్: మెదక్ పట్టణ కాంగ్రెస్ నాయకులు అలకబూనారు. ఎమ్మెల్యే అభ్యర్థి ఉపేందర్రెడ్డి తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని అసంతృప్తితో ఉన్న మెదక్ నాయకులు, కార్యకర్తలు సోమవారం జిల్లా నాయకుడు బట్టి జగపతి వ్యవసాయ క్షేత్రంలో సమావేశమయ్యారు. సమావేశంలో బట్టి జగపతితోపాటు కాంగ్రెస్ నాయకులు చంద్రపాల్, సుప్రభాతరావు, మ్యాడం బాలకృష్ణ, యువజన కాంగ్రెస్ నాయకుడు బట్టి ఉదయ్, మెదక్ పట్టణ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పట్టణానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు తమ అభిప్రాయాలను జగపతితో పంచుకున్నారు. మెదక్ ఎమ్మెల్యే అభ్యర్థి ఉపేందర్రెడ్డి ఇప్పటి వరకు తమను సంప్రదించలేదని, ప్రచారం ఎలా పాల్గొనాలని మెదక్ పట్టణానికి చెందిన పలువురు నాయకులు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఉపేందర్రెడ్డి ఇప్పుడే అందరినీ కలుపుకుపోవటం లేదని రేపు ఎమ్మెల్యేగా గెలిస్తే తమ రాజకీయ భవిష్యత్తు ఏమిటని పలువురు ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం.
అందరి అభిప్రాయాలను తెలుసుకున్న బట్టి జగపతి తాను ఎమ్మెల్యే అభ్యర్థి ఉపేందర్రెడ్డితో మాట్లాడతానని కార్యకర్తల అభిప్రాయాలు ఆయన దృష్టికి తీసుకెళ్లి అందరికీ ప్రాధాన్యం దక్కేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
అయితే అన్నింటినీ పక్కనబెట్టి కాంగ్రెస్ అభ్యర్థి ఉపేందర్రెడ్డి గెలుపుకోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని, కార్యకర్తలకు అండగా తాను ఉంటానని హామీ ఇచ్చినట్లు సమాచారం. కాంగ్రెస్ నాయకులు సమావేశం విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అభ్యర్థి ఉపేందర్రెడ్డి మంగళవారం పట్టణ నాయకులతో సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.