పారదర్శకంగా ‘డబుల్’ లబ్ధిదారుల ఎంపిక
దశలవారీగా ఇళ్ల కేటాయింపు : మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలని పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్దిష్ట కార్యాచరణను తయారు చేయాలన్నారు. పట్టణప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిపై శనివారం గృహ నిర్మాణ, పశుసంవర్థకశాఖ మంత్రులు ప్రశాంత్రెడ్డి, శ్రీనివాస్యాదవ్తో కలసి ప్రగతి భవన్లో అధికారులతో కేటీఆర్ సమీక్షించారు. అర్హులైన పేదలకే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉండాలనేదే ప్రభుత్వ లక్ష్యమని, ఎంపికలో లాటరీ పద్ధతిని అవలంభించాలని ఆదేశించారు.
గ్రేటర్లో 70% పనులు పూర్తి
జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని హౌసింగ్ శాఖ అధికారులు మంత్రుల దృష్టికి తెచ్చారు. ఇప్పటికే 70% పనులు పూర్తయ్యాయని, మిగతావి కూడా చురుగ్గా కొనసాగుతున్నాయన్నారు.