బీజేపీ మాజీ నేత భరత్రెడ్డిపై కిడ్నాప్ కేసు
ఘటన జరిగిన తర్వాత కనిపించకుండా పోయిన బాధితులు
నవీపేట (బోధన్): ఇద్దరు దళితులపై దాడి చేసి అవమానించిన ఘటనలో బీజేపీ మాజీ నేత భరత్రెడ్డిపై కిడ్నాప్ కేసు నమోదైంది. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం అభంగపట్నంలో జరిగిన ఈ దాడి తర్వాత నిందితుడు పరారుకాగా.. బాధితులు లక్ష్మణ్, రాజేశ్వర్లు కనిపించకుండా పోయారు. దీనిపై వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో భరత్రెడ్డిపై పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు.
అక్రమాలను అడ్డుకున్నందుకు..
అభంగపట్నంలో భరత్రెడ్డి అనుచరులు అక్రమంగా మొరం తరలిస్తుండగా లక్ష్మణ్, రాజేశ్వర్ అడ్డుకున్నారు. దాంతో భరత్రెడ్డి వారిపై దాడిచేసి, నీటి గుంటలో మునిగించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. భరత్రెడ్డిపై చర్యలు చేపట్టాలంటూ దళిత, విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఘటన తర్వాత లక్ష్మణ్, రాజేశ్వర్లు కనిపించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. నిందితుడిని 24 గంటల్లో అరెస్టు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.