6న ఢిల్లీకి కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్రావు ఈ నెల 6న ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించారు. ప్రధాని నరేంద్రమోడీతో భేటీ కానున్నారు. అక్టోబర్లో హైదరాబాద్లో నిర్వహించే అంతర్జాతీయ మెట్రో పోలీసు సద స్సుకు ఆయన్ను ఆహ్వానించనున్నారు. ఈ నెల 6 లేదా 7న మోడీని కలిసేందుకు సమయం కేటాయించాలని పీఎంవోకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఐఐటీ, విద్యుత్ సమస్య, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ, జాతీయ రహదారులు, ప్రాణహిత- చేవెళ్ల వంటి వాటి కోసం కేసీఆర్ వివిధ శాఖల కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఈ మేరకు కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, నితిన్ గడ్కారి, ఉమా భారతి, పీయూష్ గోయల్ల అపాయింట్మెంటును కూడా కోరారు.
కేసీఆర్కు దంత పరీక్షలు
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు బుధవారం దంత పరీక్షలు చేయించుకున్నారు. హైదరాబాద్ ఆనంద్నగర్ కాలనీలోని ది రాయల్ హాస్పిటల్ ఫర్ డెంటిస్ట్రీ అండ్ ఫేషియల్ సర్జరీలో వైద్యులు నరేష్, మాధురిలు సీఎంకు దంత పరీక్షలు నిర్వహించారు. కాగా, సీఎం కేసీఆర్ బుధవారం సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో కంటి పరీక్షలు చేయించుకున్నారు. అలాగే, అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావును పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.