పారిశ్రామిక సంఘాలతో నేడు కేసీఆర్ భేటీ

పారిశ్రామిక సంఘాలతో నేడు కేసీఆర్ భేటీ - Sakshi


‘రైట్ టు సింగిల్ విండో’పై అభిప్రాయాల సేకరణ



హైదరాబాద్: వివిధ పారిశ్రామిక సంఘాలతో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నేడు (29వ తేదీ సోమవారం) మధ్యాహ్నం భేటీ కానున్నారు. ఈ సందర్భంగా పరిశ్రమలకు ‘సింగిల్ విండో అనుమతులు పొందడం హక్కు’గా చేసేందుకు ప్రభుత్వం తీసుకురానున్న ఆర్డినెన్స్‌పై వారి అభిప్రాయాలు తెలుసుకోనున్నారు. సీఐఐ, ఫ్యాప్సీతోపాటు మరికొన్ని సంఘాల ప్రతినిధులు కూడా సీఎంతో జరిగే సమావేశంలో పాల్గొంటారని ప్రభుత్వవర్గాలు తెలిపాయి. పరిశ్రమలకు అన్నిరకాల అనుమతులను సింగిల్‌విండో ద్వారా ఇవ్వడంతోపాటు.. దీన్ని హక్కుగా చేసేందుకు ‘రైట్ టు సింగిల్ విండో’ ఆర్డినెన్స్‌ను తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఇకపై పరిశ్రమలకు అన్ని అనుమతులను 15 రోజుల్లోగా ఇవ్వాల్సి ఉంటుంది. లేనిపక్షంలో బాధ్యులైన అధికారుల జీతంలో కోత కోసి ఆ మొత్తాన్ని పరిశ్రమలకు ఇచ్చేందుకు వీలుగా ఈ ఆర్డినెన్స్‌ను ప్రభుత్వం రూపొందించింది.



దీనిపై శనివారం ఒకసారి అధికారులతో భేటీ అయిన సీఎం.. ఆదివారం కూడా పరిశ్రమలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్రతోపాటు న్యాయశాఖ అధికారులతో కూడా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆర్డినెన్స్‌పై పారిశ్రామిక సంఘాల అభిప్రాయాలు కూడా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సోమవారం సంఘాల ప్రతినిధులతో సమావేశమవ్వాలని సీఎం నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా ఆర్డినెన్స్‌పై వారి అభిప్రాయాలను కూడా సేకరించి.. అందుకు అనుగుణంగా ఆర్డినెన్స్‌లో మార్పులు, చేర్పులు చేయనున్నట్టు ప్రభుత్వవర్గాలు వివరించాయి.

 

 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top