ఆలయం, ప్రాజెక్టుకు నిలయంగా కాళేశ్వరం

Kaleshwaram Care Of Tourism - Sakshi

త్రినేత్రుడు కొలువైన, మూడు నదుల సంగమ ప్రాంతంగా ప్రసిద్ధి

భారీ ప్రాజెక్టు తొలి అడుగులు ఇక్కడే

సాక్షి, కాళేశ్వరం: త్రినేత్రుడు కొలువైన ప్రదేశం కాళేశ్వరం... మూడు నదులు సంగమించే ప్రదేశం.. ఇలా అనేక ప్రత్యేకతలతో కాళేశ్వరానికి ఆధ్యాత్మిక కేంద్రంగా ఇంత కాలం పేరుంది. ఇప్పుడు కాళేశ్వరం సిగలో ఆధునిక దేవాలయం కొలువుతీరింది. దాని పేరే కాళేశ్వరం ఎత్తి పోతల పథకం. ఆ ప్రాజెక్టు తెరపైకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ఆధ్యాత్మిక, ఆధునిక దేవాలయాల నిలయంగా మారింది. ఒకప్పుడు భక్తులతో కిటకిటలాడిన ఈ ప్రాంతం ఇప్పుడు భారీ యంత్రాలకు అడ్డాగా మారింది. ఆధ్యాత్మిక కాళేశ్వరుడు మరణ భయాన్ని దూరం చేసి ప్రజలకు అభయం ఇస్తే..... ఈ ఆధునిక కాళేశ్వరుడు తెలంగాణ ప్రజలకు సాగు, తాగు నీటి కష్టాలను దూరం చేసేలా అండగా నిలవనున్నాడు.

ఆధునిక దేవాలయం
ఆకాశం నుంచి గంగను భువికి తీసుకురావడానికి శివుడు తన ఝటాఝటాలను సాయంగా పంపినట్టు దక్షిణ గంగగా పేరున్న గోదావరిని పంట పొలాలకు తరలించేందుకు ముక్కంటి మహదేవపూర్‌ మండలాన్ని ఇచ్చాడు. నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ మాట్లాడుతూ భారీ సాగునీటి ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలు అంటూ పేర్కొన్న సంగతి తెలిసిందే. నెహ్రూ మాటలను నిజం చేస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు ఆధునిక దేవాలయంగా ప్రసిద్ధి చెందనుంది. ప్రతి సంవత్సరం వృథాగా సముద్రంలో కలుస్తున్న వేలాది టీఎంసీల్లో కొంతైనా ఒడిసి పట్టుకుని పంట పొలాల్లోకి ప్రజల లోగిళ్లలోకి తీసుకువచ్చి వారి కష్టాలను దూరం చేయడమే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే తెలంగాణలో 37.6 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. అంతేకాదు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు తాగునీటికి ఇబ్బందులు ఉండవు.

ముక్కంటితో ముడిపడిన మూడు..
కాళేశ్వరంలో కొలువైంది త్రినేత్రుడైన శివుడు. గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదులు సంగమించే త్రివేణిగా పేరొంది. ఇలా మూడు సంఖ్యకు మహదేవపూర్‌ మండలానికి ఉన్న సంబం«ధం కాళేశ్వరం సాగు నీటి ప్రాజెక్టులోనూ కనిపిస్తుంది. మూడు బ్యారేజీలు, మూడు పంపుహౌస్‌లు, పంతొమ్మిది రిజర్వాయర్లు, గ్రావిటీ కెనాల్స్, టన్నెళ్ల సమాహారమైన ఈ భారీ ప్రాజెక్టులో తొలి మూడు అడుగులైన మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌస్, అన్నారం బ్యారేజీలు మహదేవపూర్‌ మండలంలోనే నిర్మాణం జరుపుకున్నాయి. వేగంగా సముద్రం వైపు ప్రయాణిస్తున్న గోదావరి నీటికి మేడిగడ్డ బ్యారేజీ దగ్గర అడ్డుకట్ట పడుతుంది. అక్కడ నుంచి వెనుకకు గోదావరి కన్నెపల్లి పంపుహౌజ్‌ ప్రాంతానికి చేరుతుంది. ఇక్కడున్న పదొకొండు భారీ పంపుల ద్వారా గోదావరి నీటిని ఎత్తి గ్రావిటీ కెనాల్‌కు తరలించడంతో రెండో అడుగు పడుతుంది. గ్రావిటీ కెనాల్‌ ద్వారా 13.340 కిలోమీటర్లు ప్రవహించిన నీరు అన్నారం బ్యారేజీ వద్ద తిరిగి గోదావరిలో కలుస్తాయి.

జల ప్రవాహం... జనతాకిడి
పురాతన కాలం నుంచి ఆథ్యాత్మిక కేంద్రంగా కాళేశ్వరానికి పేరుంది. తాజాగా సాగునీటి ఎత్తిపోతల పథకంతో దేశవ్యాప్తంగా ఈ ప్రాంతం పేరు మార్మోగుతోంది. భవిష్యత్‌లో కాళేశ్వరం గొప్ప పర్యాటక ప్రాంతంగా కానుందనే అంచనాలు ఉన్నాయి. ప్రాజెక్టు నిర్మాణ పనులు మొదలైన తర్వాత కాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు ప్రాజెక్టు నిర్మాణ పనులు తిలకించడం పరిపాటిగా మారింది. ప్రాజెక్టు పనులు మొదలు పెట్టినప్పటి నుంచి సుమారు 5లక్షలకుపైగా సందర్శకులు సందిర్శంచినట్లు ఇంజనీర్ల అంచనా. మూడేళ్లుగా నిర్విరామంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో తలమునకలై ఉన్న ఇంజనీర్లు, కార్మికులు ఆపదల్లో శివుడిని దర్శించుకోవడం ఆనవాయితీగా మారిందని చెబుతారు. ఇటీవల ప్రారంభోత్సం తేదీ ప్రకటించిన తర్వాత పర్యాటకులను ప్రాజెక్టు సందర్శనకు అనుమతించలేదు.

పర్యాటకులను నియంత్రించేందుకు ప్రత్యేకంగా బోర్డులు, సెక్యూరిటీని ఏర్పాటు చేయాల్సి రావడం ఈ ప్రాజెక్టుకు ఉన్న క్రేజ్‌ను చెబుతోంది. ఒకప్పుడు తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న కాశేశ్వరం మారుమూల అటవీ ప్రాంతంలో ఉండేది. రోడ్డు రవాణా కష్టంగా ఉండేది. ఇటీవల గోదావరి, ప్రాణహిత నదులపై రెండు వంతెనలు అందుబాటులోకి వచ్చాయి. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలతో మరో రెండు వంతెనలు వచ్చాయి. దీనికి తోడు మేడిగడ్డ నుంచి సుందిళ్ల వరకు గోదావరిలో ఏడాది పొడవునా నీరు నిలవ ఉండనుంది. దీంతో ఎకో టూరిజం, వాటర్‌ టూరిజాలకు కాళేశ్వరం కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతుందని చెబుతున్నారు. ఇదే విషయాన్ని స్వయానా సీఎం కేసీఆర్‌ అనేక సందర్భాల్లో పేర్కొన్న విషయం విదితమే.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top