నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు
సిటీ సీపీకి కేఏ పాల్ ఫిర్యాదు
చంద్రబాబే కారకుడని ఆరోపణ
హిమాయత్నగర్: ప్రపంచవ్యాప్తంగా తనకున్న క్రేజ్, ఇమేజ్ని డ్యామేజ్ చేసేందుకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కొన్ని యూట్యూబ్, మీడియా చానెళ్లలో అసత్య ప్రచారం చేయిస్తున్నాడని ‘ప్రజా శాంతి’ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, రెవరెండ్ కేఏ పాల్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన సోమవారం నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్కు ఫిర్యాదు చేశారు. సీపీతో సమావేశం అనంతరం పాల్ మీడియాతో మాట్లాడుతూ... సాయి అనే వ్యక్తి సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేస్తున్నాడని, దీనికి చంద్రబాబే కారకుడని ఆరోపించారు.
దీనికి సంబంధించిన ఆధారాలను సీపీకి అందజేశానన్నారు. ‘నేను అమెరికా నుంచి అక్రమంగా డబ్బు తీసుకొచ్చి ఇక్కడ ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నానని, ఒంగోలులో నా బ్రదర్ని చంపానని, ఆ కేసులో అరెస్ట్ అయ్యాన’ని సోషల్ మీడియా కేంద్రంగా ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఈ కేసులో తన ప్రమేయం లేదని తీర్పు వచ్చిందని గుర్తు చేశారు. ‘నేను ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకునేందుకే ఆంధ్రప్రదేశ్లో నాకు సెక్యూరిటీ ఇవ్వడం లేదు. ఈ విషయాన్ని కోర్టుకు కూడా తెలియజేశాను. సెక్యూరిటీ నిమిత్తం హైదరాబాద్ పోలీసులను కోరగా, సీపీ హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో ఏపీలో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామ’ని పేర్కొన్నారు.