జూరాల, శ్రీశైలంకు తగ్గిన వరద
శ్రీశైలంలో 151 టీఎంసీలు, సాగర్లో 141.73 టీఎంసీల నిల్వ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదిలో వరద ప్రవాహం తగ్గిపోవడంతో ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల గేట్లను దించేశారు. దిగువకు నీటిని విడుదల చేయకపోవడంతో జూరాల ప్రాజెక్టు, శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గింది. గురువారం జూరాల ప్రాజెక్టులోకి 84,236 క్యూసెక్కులు రాగా అంతే నీటిని దిగువకు విడుదల చేశారు. సాయంత్రం 5 గంటలకు వరద తగ్గడంతో దిగువకు విడుదల చేసే నీటిని తగ్గిస్తూ వస్తున్నారు.
దీంతో శ్రీశైలం జలాశయంలోకి 42,265 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. కుడిగట్టు, ఎడమగట్టు విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ శ్రీశైలం నుంచి విడుదల చేస్తున్న నీటిలో 42,378 క్యూసెక్కులు నాగార్జునసాగర్కు చేరుతున్నాయి. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నీటి మట్టం 872.1 అడుగుల్లో 150.81 టీఎంసీల వద్ద ఉంది. శ్రీశైలం నుంచి విడుదల చేస్తున్న నీటి వల్ల నాగార్జునసాగర్లో నీటి నిల్వ 515.8 అడుగుల్లో 141.73 టీఎంసీలకు చేరుకుంది.