టీచర్లను నిందించడం సరికాదు
దీనివల్ల ప్రభుత్వ విద్యపై విశ్వాసం సన్నగిల్లుతుంది
మంత్రి కేటీఆర్పై ఉపాధ్యాయ సంఘాల విమర్శ
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయులు బడులకు సరిగా వెళ్లరని, అందుకే విద్యా రంగాన్ని బాగుచేయలేకపోతున్నామని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించడం అసమంజసమని పలు ఉపాధ్యాయ సంఘాలు విమర్శించాయి. ఉపాధ్యాయులను నిందించడం సరికాదని వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నాయి. రవీంద్రభారతిలో మంగళవారం మీసేవ ఆపరేటర్ల సమావేశం సందర్భంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారని.. అలాంటి వ్యాఖ్యల వల్ల ప్రభుత్వ విద్యపై విశ్వాసం సన్నగిల్లు తుందని పేర్కొన్నాయి. ఉపాధ్యాయులు బడికి వెళ్లకుంటే చర్యలు చేపట్టడానికి విద్యా శాఖ అధికార యంత్రాంగం ఉందని ఎస్టీయూటీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భుజంగరావు, సదానందంగౌడ్ పేర్కొన్నారు.
ఉపాధ్యాయులు బడుల్లో ఎన్ని అసౌకర్యాలున్నా లెక్క చేయకుండా బాధ్యతగా బోధిస్తున్నారని, ఇవేవీ తెలుసు కోకుండా మంత్రి మాట్లాడటం సరికాదని వ్యాఖ్యానించారు. పనిచేయని ఉపాధ్యా యులపై చర్యలు తీసుకునే అధికారమున్న మంత్రులే.. ఇలా అందరినీ ఒకే గాటనకట్టి మాట్లాడటమేమిటని, విద్యారంగం అభివృ ద్ధికి ఇది ఏరకంగా దోహదపడుతుందో ఆలోచించాలని యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నర్సిరెడ్డి, చావ రవి పేర్కొన్నారు. ‘తెలంగాణ రాష్ట్రం వచ్చాక బడికి పోని ఉపాధ్యాయులను ఎంతమందిని గుర్తించారు? ఎంతమందిపై చర్యలు తీసుకు న్నారు?’అని ప్రశ్నించారు. మంత్రి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని.. చేత నైతే ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం కృషి చేయాలని వ్యాఖ్యానించారు. ఇక ప్రభుత్వ ఉపాధ్యాయులను విమర్శిస్తూ వారి మనోధైర్యాన్ని దెబ్బతీయవద్దని తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ హెడ్మాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మల్లికార్జున శర్మ, లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్య అందిస్తూ 90 శాతం ఫలితా లను సాధిస్తున్న టీచర్లను కించపరిచేలా మాట్లాడటం గర్హనీయమన్నారు.